టీమిండియాలోకి కడప అమ్మాయి.. శ్రీలంకపై భారత్ వుమెన్స్ విక్టరీ.. మెరిసిన ప్రతీక, మంధాన-kadapa girl shree charani debut team india win over 9 wickets sri lanka tri series pratika rawal mandhana ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  టీమిండియాలోకి కడప అమ్మాయి.. శ్రీలంకపై భారత్ వుమెన్స్ విక్టరీ.. మెరిసిన ప్రతీక, మంధాన

టీమిండియాలోకి కడప అమ్మాయి.. శ్రీలంకపై భారత్ వుమెన్స్ విక్టరీ.. మెరిసిన ప్రతీక, మంధాన

మహిళల ముక్కోణపు వన్డే: భారత మహిళల క్రికెట్ జట్టులో మరో తెలుగుమ్మాయి అడుగుపెట్టింది. కడప ఆల్ రౌండర్ శ్రీ చరణి అరంగేట్రం చేసింది. ఇక ముక్కోణపు వన్డే సిరీస్ లో శ్రీలంకపై విక్టరీతో భారత్ శుభారంభం చేసింది.

స్మృతి మంధాన, ప్రతీక రావల్ (BCCI Women)

20 ఏళ్ల కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి టీమిండియా డెబ్యూ చేసింది. ఆదివారం (ఏప్రిల్ 27) ముక్కోణపు సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డేతో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కొలంబోలో జరిగిన ఈ వర్ష ప్రభావిత మ్యాచ్ లో భారత వుమెన్స్ జట్టు అదరగొట్టింది. టీమిండియా 9 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది.

సెన్సేషనల్ ఫామ్ లో ఉన్న ప్రతీకా రావల్ (62 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) మరోసారి సత్తాచాటింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను ఇన్నింగ్స్ కు 39 ఓవర్ల చొప్పున నిర్వహించారు.

బ్యాటింగ్ మెరుపులు

ఛేజింగ్ లో భారత్ అదరగొట్టింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 29.4 ఓవర్లలో 148 పరుగుల టార్గెట్ రీచ్ అయింది. ఏడో వన్డే మాత్రమే ఆడిన ప్రతీక రావల్ ఫామ్ కొనసాగించింది. కెరీర్ లో తొలి ఆరు వన్డే ఇన్నింగ్స్ ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా హిస్టరీ క్రియేట్ చేసిన ఈ 24 ఏళ్ల ప్రతీక మళ్లీ అదరగొట్టింది.

‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రతీక అజేయంగా హాఫ్ సెంచరీ సాధించింది. స్మృతి మంధాన (43), హర్లీన్ డియోల్ (48 నాటౌట్) కూడా రాణించారు. మంధానతో కలిసి 59 బంతుల్లో 54 పరుగులు, డియోల్ తో కలిసి 120 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రావల్ భారత్ ను విజయతీరాలకు చేర్చింది.

లంక ఢమాల్

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక అమ్మాయిలను భారత బౌలర్లు కట్టడి చేశారు. స్పిన్నర్లు స్నేహ్ రాణా 3, శ్రీ చరణి 2, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి ఓ వికెట్ తీసింది. భారీ వర్షం కారణంగా మూడు గంటల ఆలస్యం కావడంతో మ్యాచ్ ను 39 ఓవర్లకు కుదించారు.

ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను భారత్ 38.1 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూల్చింది. ఆ టీమ్ లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్. ఈ ట్రై సిరీస్ లో భారత్ తన తర్వాతి మ్యాచ్ లో ఏప్రిల్ 29న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం