ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో టీమిండియా ఆలస్యంగా పుంజుకుంది. బుమ్రా అయిదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ చేసింది. బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌటైంది. బుమ్రాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లతో, సిరాజ్ 2 వికెట్లతో సత్తాచాటారు. ఇండియాకు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యరీ బ్రూక్ 99 పరుగుల దగ్గర ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 471 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఓవర్ నైట్ స్కోరు 209/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. ఓవర్ నైట్ బ్యాటర్ పోప్ 106 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓవర్ నైట్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు. అతను ఇచ్చిన క్యాచ్ లను భారత ఫీల్డర్లు పట్టలేకపోయారు. రెండు మూడు క్యాచ్ లు వదిలేశారు. ఈ ఛాన్స్ లను ఉపయోగించుకుని బ్రూక్ పరుగులు సాధించాడు. కానీ సెంచరీ ఒక్క పరుగు దూరంలో అతణ్ని.. ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు.
హ్యారీ బ్రూక్ వికెట్ తర్వాత బుమ్రా చెలరేగాడు. కానీ జేమీ స్మిత్ (40), క్రిస్ వోక్స్ (38), బ్రైడాన్ కర్స్ (22) కాసేపు పోరాడారు. కానీ కార్స్ ను సిరాజ్ ఔట్ చేయడంతో మళ్లీ ఇంగ్లాండ్ పతనం వేగంగా సాగిపోయింది. బుమ్రా తన వరుస ఓవర్లలో క్రిస్ వోక్స్, జోష్ టంగ్ ను ఔట్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు ఎండ్ కార్డు వేశాడు.
అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ సెంచరీ బాదేశాడు. 137 బంతుల్లో 106 పరుగులు చేశాడు. 14 ఫోర్లు కొట్టాడు. టీమిండియా బౌలర్లపై కౌంటర్ ఎటాక్ చేశాడు పోప్. బుమ్రాను కూడా దీటుగా ఎదుర్కొన్నాడు. బెన్ డకెట్ (62), రూట్ (28)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. టీమ్ స్కోరును 200 దాటించిన తర్వాత పోప్ ను ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు.
ఇంగ్లాండ్ ను టీమిండియా ఆలౌట్ చేసింది కానీ.. ఇన్నింగ్స్ ఆధిక్యం మాత్రం ఆరు పరుగులకే పరిమితమైంది. అదే భారత జట్టు మరింత బెటర్ గా ఫీల్డింగ్ చేసి ఉంటే ఇంగ్లాండ్ ఇంకా ముందుగానే ఆలౌట్ అయ్యేది. కానీ మంచి ఛాన్స్ ను టీమిండియా మిస్ చేసుకుంది.
సంబంధిత కథనం