ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈ లీగ్ మ్యాచ్ ల సంఖ్యను పెంచే యోచనలో బీసీసీఐ ఉంది. ప్రపంచంలోనే ఇప్పటికే అతిపెద్ద టీ20 టోర్నీ అయిన ఐపీఎల్ లో 74 మ్యాచ్ లు జరుగుతున్నాయి. 2028 నుంచి ఈ మ్యాచ్ ల సంఖ్యను 94కు పెంచేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఐసీసీతో చర్చలు జరుగుతున్నాయని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.
ఐపీఎల్ లో 2021 వరకు సీజన్ కు 60 మ్యాచ్ లు జరిగాయి. అప్పుడు లీగ్ లో 8 జట్లు ఉండేవి. ఒక్కో టీమ్ ఇంకో జట్టుతో ఒక మ్యాచ్ హోం గ్రౌండ్ లో, ఇంకో మ్యాచ్ అపోనెంట్ గ్రౌండ్ లో ఆడేవి. లీగ్ మ్యాచ్ లు 56 కాగా.. ప్లేఆఫ్స్, ఫైనల్ కలిపి మరో 4 మ్యాచ్ లు.
కానీ 2022లో లీగ్ లోకి గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అడుగుపెట్టడంతో టీమ్స్ సంఖ్య 10కి పెరిగింది. మ్యాచ్ ల సంఖ్య 60 నుంచి 74కు పెరిగాయి.
2022 నుంచి ఐపీఎల్ లో అయిదు జట్లను రెండేసి గ్రూప్ లుగా వర్చువల్ గా డివైడ్ చేశారు. ఓ టీమ్ తన గ్రూప్ లోని ఇతర జట్లతో రెండేసి మ్యాచ్ లు.. అవతలి గ్రూప్ లోని 4 టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతున్నాయి. దీంతో పాటు తన స్థాయి ఉన్న అవతలి గ్రూప్ లోని టీమ్ తో రెండు మ్యాచ్ లాడుతున్నాయి. ఇలా ప్రతి టీమ్ 14 మ్యాచ్ లాడుతున్నాయి. లీగ్ లో 70, ప్లేఆఫ్స్ 4 మ్యాచ్ లు.
ప్రస్తుతం లీగ్ ఫార్మాట్ ప్రకారం చూస్తే కొన్ని జట్లు హోం, అపోనెంట్ గ్రౌండ్ లో ఒకే టీమ్ తో రెండు మ్యాచ్ లు ఆడే అవకాశం లేదు. అందుకే పాత ఫార్మాట్ ప్రకారం ఓ టీమ్.. ఒక అపోనెంట్ తో హోం గ్రౌండ్ లో ఒకటి, ప్రత్యర్థి స్టేడియంలో మరొకటి ఆడేలా చూసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఇలా జరిగితే లీగ్ లో ఒక్కో టీమ్ 18 మ్యాచ్ లు ఆడుతుంది. మొత్తం మ్యాచ్ ల సంఖ్య 94కు పెరుగుతుంది.
2028 నుంచి ఐపీఎల్ మ్యాచ్ ల సంఖ్యను పెంచాలని చూస్తున్నట్లు క్రిక్ఇన్ఫోతో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.
"ఖచ్చితంగా ఆ అవకాశం ఉంది. ఐసీసీతో చర్చిస్తున్నా. బీసీసీఐలో అంతర్గతంగా చర్చిస్తున్నాం. ద్వైపాక్షిక, ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి, ఫ్రాంచైజీ క్రికెట్, టీ20 క్రికెట్ సంబంధించి అభిమానుల ఆసక్తి ఎలా మారుతుందో చూడాలి. దానిపై సీరియస్ గా ఫోకస్ పెట్టాలి’’ అని ధుమాల్ ఈఎస్పిఎన్ క్రిక్ఇన్ఫోతో అన్నారు.
ఐపీఎల్ 74 మ్యాచ్ లు ఉంటేనే దాదాపు రెండు నెలల పాటు లీగ్ సాగుతోంది. 94 మ్యాచ్ లంటే ఇంకా ఎక్కువ సమయం కావాలి. ఆ విండో బీసీసీఐకి దక్కుతుందో లేదో చూడాలి.
"ప్రతి జట్టు హోం, అపోనెంట్ గ్రౌండ్ లో ఇతర టీమ్ తో ఆడాలంటే 94 మ్యాచ్ లు అవసరం. ద్వైపాక్షిక క్రికెట్, ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి మాకు ఉన్న కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఫ్యూచర్ లో ట్రై చేస్తాం’’ అని ధుమాల్ చెప్పారు. చాలా క్రికెట్ కారణంగా ఈ ఏడాది 84 మ్యాచ్ లు నిర్వహించలేకపోయామని ఆయన అన్నారు. లీగ్ లో జట్ల సంఖ్య 10 కంటే ఎక్కువ పెరగదని ధుమాల్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం