దేశ సాయుధ దళాలు మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి శత్రు దేశంతో పోరాడుతున్నాయి. పాకిస్థాన్ తో యుద్ధంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ సమయంలో ఐపీఎల్ ఇంపార్టెంట్ ఏమీ కాదు. అందరి లక్ష్యం పాకిస్థాన్ పై భారత్ విజయమే. కానీ భారత్, పాకిస్థాన్ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2025ను వారం పాటు సస్పెండ్ చేసిన బీసీసీఐ భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశం కోసం ఇది తప్పదు.
ప్రస్తుతానికి ఐపీఎల్ 18వ సీజన్ను వారం పాటు నిలిపివేశారు. రాబోయే ఏడు రోజుల్లో.. టోర్నమెంట్ పాలక మండలి అనేక ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తుంది. టోర్నమెంట్లో నాలుగో వంతు కంటే తక్కువ మ్యాచ్ లు మిగిలాయి. నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లతో సహా 16 మ్యాచ్లను నిలిపివేశారు. రాబోయే వారం రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి ఈ మ్యాచ్ లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో నిర్ణయిస్తారు.
పాకిస్తాన్తో మన సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా లీగ్ను నిలిపివేయాలనే నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించరు. అయితే, రద్దు చేసిన ప్రతి మ్యాచ్ భారీ నష్టాన్ని బీసీసీఐకి కలిగిస్తుందని తెలుస్తోంది. ప్రతి మ్యాచ్ జరగకపోవడం వల్ల రూ. 100 కోట్ల నుంచి రూ. 125 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు.ఈ మ్యాచ్ లకు ఇన్సురెన్స్ ఉంది. అయితే భీమా మొత్తాన్ని పరిగణలోకి తీసుకున్నా.. లైవ్ టెలికాస్ట్, స్పాన్సర్షిప్, ఇతర మ్యాచ్ సంబంధిత ఆదాయాలను బట్టి చూస్తే సగం నష్టం వాటిల్లే అవకాశముంది.
పాకిస్థాన్ తో భారత త్రివిధ దళాలు పోరాడుతున్న ఈ సమయంలో ఐపీఎల్ నష్టం గురించి ఎవరూ ఆలోచించకపోవచ్చు. కానీ ప్రధాన వాటాదారులు, జట్టు యజమానులు, ఆటగాళ్లు, హోస్ట్ బ్రాడ్కాస్టర్లు, వివిధ రకాల స్పాన్సర్లు నష్టపోతారు. వీళ్లే కాకుండా స్టేడియం లోపల, బయట ఉన్న విక్రేతలు, వస్తువులను విక్రయించేవారు, మ్యాచ్ జరిగే నగరంలో రెస్టారెంట్లు, క్యాబ్, త్రీ-వీలర్ ఆపరేటర్లు.. ఇలా చాలా మందిపై ప్రభావం పడుతోంది.
ఒకవేళ ఐపీఎల్ 2025 సీజన్ పూర్తిగా రద్దయితే.. బీసీసీఐకి మరింత భారీ నష్టం తప్పకపోవచ్చు. అయితే హోస్ట్ బ్రాడ్కాస్టర్లు రూ. 5,500 కోట్ల ప్రకటనల ఆదాయంలో మూడింట ఒక వంతును వదులుకోవాల్సి ఉంటుంది. పది ఫ్రాంచైజీలు కొంతవరకు ప్రభావితమవుతాయి. ప్రసార, స్పాన్సర్షిప్ హక్కులతో సహా ఐపీఎల్ సెంట్రల్ పూల్ నుంచి వచ్చే ఆదాయంపై ఎక్కువగా ఆధారపడేవారు ఎక్కువ నష్టపోతారు.
ఇక టికెట్ల విషయానికి వస్తే లీగ్ మ్యాచ్ ల ఆదాయం ఫ్రాంఛైజీలకు వెళ్తుంది. ఫైనల్ సహా నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్ ల టికెట్ల రాబడి బీసీసీఐకి వెళ్తుంది. అయితే ఐపీఎల్ 18వ సీజన్ ను తిరిగి నిర్వహించేందుకే బీసీసీఐ చూస్తోంది. ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు రెడీగా ఉండాలని సూచించిందని తెలిసింది. అంతే కాకుండా విదేశీ ఆటగాళ్లు కూడా తిరిగి లీగ్ కోసం వచ్చే అవకాశమూ ఉంది.
సంబంధిత కథనం