ఐపీఎల్ 2025 ను ఒక వారం పాటు నిలిపివేయడం వల్ల సీజన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ శుక్రవారం (మే 9) ఈ నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్ను ఏడు రోజుల పాటు నిలిపివేయాలని డిసైడ్ అయింది. అంతకంటే ముందు గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్ ఎలా ఉందో చూసేయండి.
ఐపీఎల్ 18వ సీజన్ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. టైటాన్స్ ప్రస్తుతం 11 మ్యాచ్లలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 16 పాయింట్లతోనే ఉన్నా నెట్ రన్ రేట్ లో వెనుకబడి సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ (15) మూడో స్థానంలో ఉండగా, ముంబయి ఇండియన్స్ (14) నాలుగో స్థానంలో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (13), కోల్ కతా నైట్ రైడర్స్ (11), లక్నో సూపర్ జెయింట్స్ (10), సన్ రైజర్స్ హైదరాబాద్ (7), రాజస్థాన్ రాయల్స్ (6), చెన్నై సూపర్ కింగ్స్ (6) వరుసగా 5 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికే కేకేఆర్, సన్ రైజర్స్, రాజస్థాన్, సీఎస్కే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. గురువారం రాత్రి ధర్మశాలలో మ్యాచ్ జరిగి, ఢిల్లీపై పంజాబ్ గెలిస్తే ప్లేఆఫ్స్ చేరిన ఫస్ట్ టీమ్ గా నిలిచేది.
ఈ మ్యాచ్ ఫలితంపై ఐపీఎల్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. సాధారణంగా మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. కానీ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎలాంటి పాయింట్లు ఇవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్ ను మళ్లీ నిర్వహిస్తారేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐపీఎల్ 2025లో ఇంకా 16 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు నిర్వహిస్తారు. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి 58 మ్యాచ్ లు కంప్లీట్ అయ్యాయి. ఇక 12 లీగ్ మ్యాచ్ లు, మూడు ప్లేఆఫ్స్, ఓ ఫైనల్ మిగిలి ఉంది. ఈ టోర్నమెంట్ను తిరిగి ప్రారంభించడానికి ముందు పరిస్థితి మెరుగుపడిందా? లేదా? అనే అంశాన్ని బీసీసీఐ పరిశీలించనుంది.
సంబంధిత కథనం