ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ - క్రికెట‌ర్ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న‌!-ipl 2025 suspended amid india pakistan border tensions ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ - క్రికెట‌ర్ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న‌!

ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ - క్రికెట‌ర్ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న‌!

Nelki Naresh HT Telugu

ఐపీఎల్ 2025ని బీసీసీఐ వాయిదా వేసింది. భార‌త్, పాకిస్థాన్ దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో క్రికెట‌ర్ల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఐపీఎల్ 2025ని తిరిగి నిర్వ‌హిస్తారా? లేదా? అన్న దానిపై మాత్రం స్ప‌ష్ట‌త రాలేదు.

ఐపీఎల్ 2025

ఐపీఎల్ 2025 ని వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకున్న‌ది. భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆట‌గాళ్ల భ‌ద్ర‌తను దృష్టిలో పెట్టునే ఐపీఎల్‌ను అర్థాంత‌రంగా ముగించింది బీసీసీఐ. యుద్ద ప‌రిస్థితుల్లో లీగ్‌ను కొన‌సాగించ‌డం సుర‌క్షితం కాద‌నే బీసీసీఐ నిశ్చ‌యించుకున్న‌ట్లు చెబుతోన్నారు.

సందేహాలు వ్య‌క్తం...

విదేశీ క్రికెట‌ర్ల యోగ‌క్షేమాల‌పై ఆయా దేశాల క్రికెట్ బోర్డులు సందేహాలు వ్య‌క్తం చేస్తోన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్న వేదిక‌ల‌లో దాడులు జ‌ర‌గొచ్చ‌నే ప్ర‌చారాలు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఆస్ట్రేలియాతో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన క్రికెట‌ర్లు ఇండియాను విడిచివెళ్లాల‌ని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప‌రిణామాల నేప‌థ్యంలో ఐపీఎల్‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేయాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతోన్నారు. భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాల వ‌ల్లే గురువారం ఢిల్లీ, పంజాబ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ను మ‌ధ్య‌లోపే ఆపేశారు. స్టేడియం నుంచి అభిమానుల‌ను అర్ధాంత‌రంగా పంపించేశారు. తాజాగా ఐపీఎల్ మొత్తాన్ని నిలిపివేశారు.

మ‌ళ్లీ నిర్వ‌హిస్తారా?

తిరిగి ఐపీఎల్ 2025 మొద‌ల‌వుతుందా? మిగిలిన మ్యాచ్‌ల‌ను మ‌ళ్లీ నిర్వ‌హిస్తారా అన్న దానిపై మాత్రం స్ప‌ష్ట‌త రాలేదు. ఐపీఎల్‌లో ఇంకా ప‌న్నెండు మ్యాచులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. మే 25న ఫైన‌ల్ జ‌ర‌గాల్సివుంది. ఐపీఎల్ 2025ని విదేశాల్లో నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. ప్లే ఆఫ్స్ ముంగిట ఐపీఎల్ వాయిదాప‌డ‌టంతో క్రికెట్ అభిమానులు నిరాశ‌కు లోన‌య్యారు.

పంజాబ్‌...ఢిల్లీ క్రికెట‌ర్లు...

ఐపీఎల్ వాయిదా నేప‌థ్యంలో విదేశీ క్రికెట‌ర్లు భార‌త్‌ను విడిచి వెళ్లిపోనున్న‌ట్లు తెలుస్తోంది.మ‌రోవైపు పంజాబ్‌, ఢిల్లీ జ‌ట్ల ఆట‌గాళ్ల‌ను ఢిల్లీకి త‌ర‌లించే విష‌యంలో బీసీసీఐ క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తోన్న‌ట్లు తెలిసింది. స్పెష‌ల్ ట్రైన్‌లో వారిని ఢిల్లీని పంపించాల‌ని అనుకున్న‌ది. అందుకు కుద‌ర‌క‌పోవ‌డంతో తాజాగా బ‌స్సుల్లోనే క్రికెట‌ర్ల‌ను ఢిల్లీకి పంపించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.