ఐపీఎల్ 2025 ని వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టునే ఐపీఎల్ను అర్థాంతరంగా ముగించింది బీసీసీఐ. యుద్ద పరిస్థితుల్లో లీగ్ను కొనసాగించడం సురక్షితం కాదనే బీసీసీఐ నిశ్చయించుకున్నట్లు చెబుతోన్నారు.
విదేశీ క్రికెటర్ల యోగక్షేమాలపై ఆయా దేశాల క్రికెట్ బోర్డులు సందేహాలు వ్యక్తం చేస్తోన్నాయి. ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న వేదికలలో దాడులు జరగొచ్చనే ప్రచారాలు జరుగుతోన్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు ఇండియాను విడిచివెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు చెబుతోన్నారు. భద్రతా పరమైన కారణాల వల్లే గురువారం ఢిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ను మధ్యలోపే ఆపేశారు. స్టేడియం నుంచి అభిమానులను అర్ధాంతరంగా పంపించేశారు. తాజాగా ఐపీఎల్ మొత్తాన్ని నిలిపివేశారు.
తిరిగి ఐపీఎల్ 2025 మొదలవుతుందా? మిగిలిన మ్యాచ్లను మళ్లీ నిర్వహిస్తారా అన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఐపీఎల్లో ఇంకా పన్నెండు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మే 25న ఫైనల్ జరగాల్సివుంది. ఐపీఎల్ 2025ని విదేశాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. ప్లే ఆఫ్స్ ముంగిట ఐపీఎల్ వాయిదాపడటంతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనయ్యారు.
ఐపీఎల్ వాయిదా నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు భారత్ను విడిచి వెళ్లిపోనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు పంజాబ్, ఢిల్లీ జట్ల ఆటగాళ్లను ఢిల్లీకి తరలించే విషయంలో బీసీసీఐ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోన్నట్లు తెలిసింది. స్పెషల్ ట్రైన్లో వారిని ఢిల్లీని పంపించాలని అనుకున్నది. అందుకు కుదరకపోవడంతో తాజాగా బస్సుల్లోనే క్రికెటర్లను ఢిల్లీకి పంపించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోన్నట్లు సమాచారం.
టాపిక్