ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. కానీ ఈ మ్యాచ్ మిగతా వాటిలా ఉండటం లేదు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు సంతాపం వ్యక్తం చేసే క్రమంలో ఈ మ్యాచ్ నిర్వహణలో కొన్ని మార్పులు జరిగాయి. బుధవారం (ఏప్రిల్ 23) ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ ప్లేయర్స్ నల్లటి రిబ్బన్లు ధరించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇది కేవలం షెడ్యూల్ ప్రకారం నిర్వహించే మ్యాచ్ గానే మిగిలిపోనుంది. పహల్గామ్ లో మంగళవారం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ లో చీర్ లీడర్స్ ను పక్కనపెట్టారు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు, అంపైర్లతో సహా స్టేడియంలో ఉన్నవాళ్లందరూ నిమిషం పాటు మౌనం పాటించారు.
ఐపీఎల్ 2025లో నేడు ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా ముంబయి కెప్టెన్ హార్దిక్ మాట్లాడుతూ.. ‘‘ఉగ్రదాడి విషయం తెలిసి హృదయం బద్దలైంది. ఇలాంటి హేయమైన చర్యను నేను, ముంబయి టీమ్ ఖండిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.
8 మ్యాచ్ ల్లో 4 గెలిచి, 4 ఓడిన ముంబయి ఇండియన్స్ జోష్ కొనసాగించాలని చూస్తోంది. ఆ టీమ్ వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆ టీమ్ కు విజయాలు తప్పనిసరి. ఈ మ్యాచ్ కోసం అశ్వని కుమార్ స్థానంలో విఘ్నేష్ పుతూర్ ను ముంబయి ఆడిస్తోంది.
ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండే విజయాలు సాధించింది. 7 మ్యాచ్ ల్లో అయిదు ఓడింది. ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే ముంబయి ఇండియన్స్ పై కచ్చితంగా గెలవాల్సిందే. ఈ మ్యాచ్ లో జైదేవ్ ఉనద్కత్ ను ఆడిస్తున్నట్లు సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్ పేర్కొన్నాడు.
ఉగ్రదాడిని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ కూడా ఖండించాడు. భారత్ అందమైన దేశమని, ఎప్పుడూ తమకు మంచి ఆతిథ్యాన్ని అందిస్తుందని కమిన్స్ అన్నాడు. ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్ బాధాకరమని పేర్కొన్నాడు.
సంబంధిత కథనం