ఐపీఎల్ 2025లో డూ ఆర్ డై మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సత్తాచాటింది. శుక్రవారం (ఏప్రిల్ 25) చెపాక్ లో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో 155 పరుగుల టార్గెట్ ను రీచ్ అయింది. చెపాక్ లో సీఎస్కేపై సన్ రైజర్స్ కు ఇదే ఫస్ట్ విక్టరీ.
ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, ఓ సిక్సర్), కమిందు మెండిస్ (32 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) టీమ్ ను గెలిపించారు. 9 మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ కు ఇది మూడో విక్టరీ. మరోవైపు 9 మ్యాచ్ ల్లో ఏడో ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ కు దాదాపుగా దూరమైనట్లే!
ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బాల్ కే అభిషేక్ శర్మ (0)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. హెడ్ (19) కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. దీంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి కుప్పకూలుతుందేమో అనిపించింది. కానీ ఈ సారి ఇషాన్ కిషన్ నిలబడ్డాడు.
ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ తొలి మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ మళ్లీ సీఎస్కేపై రాణించాడు. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్ పై పట్టుదలతో నిలబడ్డాడు. నెమ్మదిగా ఆడుతూనే టీమ్ ను టార్గెట్ వైపు నడిపించాడు. క్లాసెన్ (7) నిలబడలేదు. కానీ అనికేత్ వర్మ (19) కీలక పరుగులు సాధించాడు. అయితే తన వరుస ఓవర్లలో ఇషాన్, అనికేత్ ను నూర్ అహ్మద్ ఔట్ చేయడంతో కాస్త ఉత్కంఠ రేగింది.
ఛేజింగ్ లో సన్ రైజర్స్ 14 ఓవర్లకు 106/5తో నిలిచింది. ఆ టీమ్ విజయానికి 36 బంతుల్లో 49 పరుగులు కావాలి. ఆ దశలో వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్ కలిసి సన్ రైజర్స్ ను గెలిపించారు. పతిరణ వేసిన 17వ ఓవర్లో నితీశ్ రెండు ఫోర్లతో ఈక్వేషన్ ను ఈజీగా మార్చాడు. చివరకు మరో 8 బంతులు మిగిలి ఉండగా జట్టు గెలిచింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. సన్ రైజర్స్ బౌలర్ హర్షల్ పటేల్ (4/28) నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. కమిన్స్, జైదేవ్ ఉనద్కత్ రెండేసి వికెట్లు తీశారు. సీఎస్కే ఇన్నింగ్స్ లో డెవాల్డ్ బ్రేవిస్ (25 బంతుల్లో 42; ఓ ఫోర్, 4 సిక్సర్లు) మెరిశాడు.
సీఎస్కే తరపున ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన బ్రేవిస్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఆయూష్ మాత్రె (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) కూడా మెరిశాడు.
సంబంధిత కథనం