డాది ఏ ఉప్పల్ స్టేడియంలో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల మోత మోగించిందే.. అదే గ్రౌండ్ లో ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో ఫెయిల్ అవుతోంది. బుధవారం (ఏప్రిల్ 23) ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ లో మళ్లీ బొక్కబోర్లా పడింది. కనీసం 150 పరుగులు చేయలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది.
హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడాడు. అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరిశాడు. సన్ రైజర్స్ ను వణికించిన బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లలో 26 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు. అతను 12 పరుగులే ఇచ్చాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముంబయి పేసర్లు బౌల్ట్, దీపక్ చాహర్ ఆటాడుకున్నారు. కొత్త బంతితో సన్ రైజర్స్ ను వణికించారు. హెడ్, అభిషేక్ ను బౌల్ట్.. ఇషాన్, నితీశ్ కుమార్ ను చాహర్ పెవిలియన్ చేర్చారు. 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక్కసారిగా ఉప్పల్ స్టేడియం సైలెంట్ గా మారిపోయింది. ఇషాన్ బ్యాట్ కు బంతి తగలకున్నా పెవిలియన్ వెళ్లిపోవడం గమనార్హం.
అనికేత్ వర్మ (12) కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో 35 కే సగం వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ ను ఇంపాక్ట్ ప్లేయర్ అభినవ్ మనోహర్ తో కలిసి క్లాసెన్ ఆదుకున్నాడు. పట్టుదలతో క్రీజులో నిలబడ్డ క్లాసెన్ జట్టు పరువు కాపాడాడు. మరి దారుణమైన స్కోరు చేయకుండా కాస్త గౌరవప్రదమైన పరుగులు చేసేలా చూశాడు. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు.
మరో ఎండ్ లో అభినవ్ మనోహర్ కూడా ముంబయి బౌలర్ల పరీక్షను కాచుకున్నాడు. ఈ జోడీ ఆరో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. కానీ స్కోరు బోర్డు మాత్రం స్లోగానే సాగింది. క్లాసెన్ ను బుమ్రా ఔట్ చేశాడు. లాస్ట్ ఓవర్లో బౌల్ట్ రెండు వికెట్లు తీయడంతో సన్ రైజర్స్ 150 కూడా చేయలేకపోయింది.
సంబంధిత కథనం