ఐపీఎల్ 2025లో చావోరేవో తేల్చుకునేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. డూ ఆర్ డై మ్యాచ్ లో సోమవారం (మే 5) హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్రైజర్స్ నిష్క్రమిస్తుంది. అందుకే సొంతగడ్డపై చెలరేగాలని ఆ టీమ్ చూస్తోంది. టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తోంది. గతేడాది వీర విధ్వంసకర బ్యాటింగ్ తో రికార్డుల దుమ్ము దులిపిన ఆ టీమ్.. ఈ సారి ఐపీఎల్ 18లో మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతోంది. గతేడాది రన్నరప్ సన్రైజర్స్ ఈ సీజన్ లో 10 మ్యాచ్ ల్లో 7 ఓడింది. మూడు మాత్రమే గెలిచింది. ఇంకా 4 మ్యాచ్ లో ఆడబోతోంది. ఇందులో ఒక్కటి ఓడినా ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్రైజర్స్ నిష్క్రమిస్తుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే భారీ హిట్టింగ్.. రికార్డు స్కోరు.. ఇదీ గతేడాది ఐపీఎల్ లో ఉన్న పేరు. కానీ ఈ సీజన్ లో ఆ టీమ్ పరుగులు చేయడంలో తీవ్రంగా తడబడుతోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి విఫలమవుతున్నారు. హెన్రిచ్ క్లాసెన్ మాత్రమే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు.
గుజరాత్ టైటాన్స్ తో గత మ్యాచ్ లో అభిషేక్ శర్మ అదరగొట్టినా టీమ్ ను గెలిపించలేకపోయాడు. మరి హోం గ్రౌండ్ లో సన్రైజర్స్ బ్యాటర్లు చెలరేగి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమ్ కు విజయాన్ని అందిస్తారేమో చూడాలి.
ఐపీఎల్ 2025లో గ్రాండ్ గా మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత అనూహ్యంగా తడబడుతోంది. ఫస్ట్ 8 మ్యాచ్ ల్లో ఆరు గెలిచిన ఆ టీమ్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడింది. ఆర్సీబీ, కేకేఆర్ చేతిలో పరాజయం పాలైంది. ప్లేఆఫ్స్ రేసులో బెటర్ ఛాన్సెస్ ఉండాలంటే ఢిల్లీకి అర్జెంట్ గా ఓ గెలుపు కావాలి. అందుకే సన్రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుచేయాలని చూస్తోంది.
కెప్టెన్ అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, డుప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్ బ్యాటింగ్ లో ఢిల్లీకి కీలకం కానున్నారు. బౌలింగ్ లో మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్ పై ఢిల్లీ ఆశలు పెట్టుకుంది.
సంబంధిత కథనం