ఉప్పల్ స్టేడియానికి పిలవని అతిథిగా వరుణుడు వచ్చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఛేజింగ్ స్టార్ట్ కాకుండా అడ్డుకుంటున్నాడు. సోమవారం (మే 5) ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వాన కారణంగా సన్రైజర్స్ ఛేజింగ్ ఆలస్యమవుతోంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో ఇన్నింగ్స్ మధ్యలోనే వర్షం ఆరంభమైంది. కానీ చిరు జల్లులే కురవడంతో ఆ టీమ్ బ్యాటింగ్ కొనసాగించింది. కానీ ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వాన ఎక్కువైంది. భారీ వర్షం ఉప్పల్ స్టేడియాన్ని ముంచెత్తింది. దీంతో కవర్లతో గ్రౌండ్ ను కప్పి ఉంచారు. సన్రైజర్స్ ఛేజింగ్ స్టార్ట్ కావడానికి టైమ్ పట్టేలా ఉంది.
వర్షం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ రద్దయితే సన్రైజర్స్ హైదరాబాద్ కు తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ టీమ్ ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ప్రస్తుతం ఈ లీగ్ లో 10 మ్యాచ్ లాడిన సన్రైజర్స్ మూడు మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఆ టీమ్ మిగిలిన నాలుగు మ్యాచ్ లు కచ్చితంగా నెగ్గాలి. అప్పుడు ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉండేందుకు అవసరమైన 14 పాయింట్లు వస్తాయి.
కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. దీంతో సన్రైజర్స్ పాయింట్ల సంఖ్య 7కు చేరుతుంది. తర్వాతి మూడు మ్యాచ్ ల్లో ఆ టీమ్ గెలిచిన 14 పాయింట్లకు చేరుకోదు. 13 పాయింట్ల దగ్గరే ఆగిపోతుంది. ఈ నేపథ్యంలో వర్షంతో మ్యాచ్ రద్దయితే సన్రైజర్స్ ఔట్ అవుతుంది.
సన్రైజర్స్తో మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ను కెప్టెన్ కమిన్స్ వణికించాడు. కొత్త బంతితో బౌలింగ్ చేసిన కమిన్స్ తన వరుస ఓవర్లలో కరుణ్ నాయర్, డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ ను ఔట్ చేశాడు. హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కత్, ఎషన్ మలింగ కూడా బౌలింగ్ లో సత్తాచాటారు.
సన్రైజర్స్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన ఢిల్లీ క్యాపిటల్స్.. అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41; 4 ఫోర్లు) పోరాటంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది.
సంబంధిత కథనం