ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తప్పలేదు. గతేడాది రన్నరప్ గా నిలిచిన ఆ టీమ్.. ఈ సారి ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. సోమవారం (మే 5) డూర్ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్రైజర్స్ ఉప్పల్ స్టేడియంలో తలపడింది. ఢిల్లీని ఫస్ట్ 133 రన్స్ కే కట్టడి చేసిన సన్రైజర్స్ ఈజీగా టార్గెట్ రీచ్ అవుతుందని అనిపించింది. కానీ వరుణుడు ఆ టీమ్ ను దెబ్బకొట్టాడు.
ఒకవేళ వర్షం రాకపోయి ఉంటే సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో ఉండేదేమో. ఢిల్లీ క్యాపిటల్స్ సెట్ చేసిన స్వల్ప లక్ష్యాన్ని సన్రైజర్స్ ఛేదించేదే. కానీ ఢిల్లీ బ్యాటింగ్ ముగిసిన తర్వాత భారీ వర్షం ఉప్పల్ స్టేడియాన్ని ముంచెత్తింది. దీంతో సన్రైజర్స్ ఛేజింగ్ దిగే అవకాశమే రాలేదు. వర్షం తగ్గినప్పటికీ గ్రౌండ్ లో నీరు ఉండిపోయాయి. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఛేజింగ్ స్టార్ట్ చేయడం కుదరలేదు.
అయిదు ఓవర్లు ఛేజింగ్ కు స్టార్టింగ్ టైమ్ రాత్రి 11.42 గంటలకు నిర్ణయించారు. 5 ఓవర్లు సన్రైజర్స్ లక్ష్యం 42 పరుగులుగా ఉండేది. కానీ తడి ఔట్ ఫీల్డ్ కారణంగా అప్పటివరకూ ఆటకు గ్రౌండ్ రెడీ అయ్యే పరిస్థితి కనిపించలేదు. దీంతో 11.11 గంటలకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో సన్రైజర్స్కు షాక్ తప్పలేదు. మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లూ చెరో పాయింట్ పంచుకున్నాయి.
ఐపీఎల్ 2025లో 11 మ్యాచ్ లాడిన సన్రైజర్స్ మూడు మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కనీసం 14 పాయింట్లు సాధించాలి. కానీ ఇప్పుడు ఆ టీమ్ ఖాతాలో 7 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచినా ఆ టీమ్ పాయింట్లు 13 అవుతాయి. దీంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ టీమ్ నిష్క్రమించక తప్పలేదు. ఒకవేళ ఢిల్లీతో మ్యాచ్ జరిగి, సన్రైజర్స్ గెలిచి ఉంటే అప్పుడు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండేవి. మరోవైపు డీసీ 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు, ఓ రద్దుతో 13 పాయింట్లతో ఉంది. సన్రైజర్స్ చేతిలో ఓటమిని ఆ టీమ్ తప్పించుకుంది.
సన్రైజర్స్తో మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ను కెప్టెన్ కమిన్స్ వణికించాడు. కొత్త బంతితో బౌలింగ్ చేసిన కమిన్స్ తన వరుస ఓవర్లలో కరుణ్ నాయర్, డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ ను ఔట్ చేశాడు. హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కత్, ఎషన్ మలింగ కూడా బౌలింగ్ లో సత్తాచాటారు.
సన్రైజర్స్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన ఢిల్లీ క్యాపిటల్స్.. అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41; 4 ఫోర్లు) పోరాటంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది.
సంబంధిత కథనం