ఐపీఎల్ 2025 రద్దు అయిందా? నిరవధిక వాయిదా పడిందా? తిరిగి ఈ సీజన్ మ్యాచ్ లు నిర్వహిస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ బీసీసీఐ సమాధానం ఇచ్చింది. ఐపీఎల్ 18వ సీజన్ పై క్లారిటీనిచ్చింది. ఐపీఎల్ సీజన్ రద్దు కాలేదని స్పష్టం చేసింది. ఈ సీజన్ ను వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు ప్రకటించింది. మిగతా మ్యాచ్ ల షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్, పాకిస్థాన్ మద్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025ను రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. గురువారం (మే 9) ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను మధ్యలోనే ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో యుద్ధం లాంటి పరిస్థితుల్లో లీగ్ నిర్వహణ అసాధ్యమనే అభిప్రాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 18వ సీజన్ ను నిరవధిక వాయిదా వేశారనే వార్తలొచ్చాయి.
ఐపీఎల్ 2025 సీజన్ రద్దు విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ సీజన్ ను తక్షణమే వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆ మేరకు ఎక్స్ లో ఐపీఎల్ వరుస పోస్టులు పెట్టింది.
‘‘టాటా ఐపీఎల్ 2025 మిగిలిన సీజన్ ను తక్షణమే వారం పాటు సస్పెండ్ చేస్తున్నాం. కీలకమైన వాటాదార్లతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నాం. ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్ల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే బ్రాడ్ కాస్టర్, స్పాన్సర్లు, ఫ్యాన్స్ ను దృష్టిలోకి తీసుకున్నాం. మన త్రివిధ దళాల బలం, సన్నాహకాల మీద అమితమైన విశ్వాసం ఉన్న బీసీసీఐ వాటాదార్ల సమష్టి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది’’ అని ఐపీఎల్ ఎక్స్ లో పేర్కొంది.
‘‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంతో కలిసి బీసీసీఐ నిలబడుతోంది. భారత ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు, దేశ ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం. దేశాన్ని రక్షించేందుకు ఆపరేషన్ సిందూర్ ను కొనసాగిస్తున్న మన సైనికుల ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిస్వార్థ సేవకు బోర్డు సెల్యూట్ చేస్తోంది. ఇటీవలి ఉగ్రదాడి, పాకిస్థాన్ సైనికుల కవ్వింపులకు దీటుగా బదులిస్తోంది’’ అని ఐపీఎల్ పోస్టు చేసింది.
ఐపీఎల్ 2025లో మే 8 వరకు 58 మ్యాచ్ లు కంప్లీట్ అయ్యాయి. ఇంకా లీగ్, ప్లేఆఫ్స్, ఫైనల్ కలిపి 16 మ్యాచ్ లు జరగాల్సి ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మే 25న నిర్వహించాల్సి ఉంది. కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా సీజన్ ను వారం పాటు వాయిదా వేశారు. మిగిలిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
సంబంధిత కథనం