ఐపీఎల్ 2025లో హోం గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మళ్లీ షాక్. ఆ టీమ్ సొంత మైదానంలో వరుసగా మూడో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. శుక్రవారం (ఏప్రిల్ 18) మ్యాచ్ లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడింది. ఛేజింగ్ లో నేహాల్ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి పంజాబ్ ను గెలిపించాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 14 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) గొప్పగా పోరాడాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్, యాన్సెన్, చాహల్, హర్ ప్రీత్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్ లో పంజాబ్ 12.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది. ఆర్సీబీ పేసర్లు హేజిల్ వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు సాధించారు. వర్షం కారణంగా మ్యాచ్ ను ఇన్నింగ్స్ కు 14 ఓవర్ల చొప్పున నిర్వహించారు.
ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ కూడా తడబడింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్ భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు. పేసర్లు హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ ఆ టీమ్ ను దెబ్బకొట్టారు. 53 పరుగులకే ఆ టీమ్ 4 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆర్సీబీ ఏమైనా అద్భుతం చేస్తుందేమో అనిపించింది.
పంజాబ్ కింగ్స్ విజయానికి, ఓటమికి మధ్య నేహాల్ వధేరా అడ్డుగోడలా నిలబడ్డాడు. పరాజయాన్ని తరిమికొట్టి టీమ్ కు విక్టరీ అందించాడు. నేహాల్ ధనాధన్ షాట్లు ఆడాడు. 19 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 రన్స్ తో టీమ్ ను గెలిపించాడు. స్టాయినిస్ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు.
ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఇది అయిదో విజయం. దీంతో ఆ టీమ్ పాయింట్ల టేబుల్ లో రెండో ప్లేస్ కు దూసుకెళ్లింది. మూడో ఓటమితో ఆర్సీబీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు టీమ్స్ కూడా ఏడు మ్యాచ్ ల చొప్పున ఆడాయి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో ఉన్నాయి. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఢిల్లీ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. సీఎస్కే లాస్ట్ ప్లేస్ లో ఉంది.
సంబంధిత కథనం