6 మ్యాచ్ లు.. నాలుగు విజయాలు.. రెండు ఓటములు.. 8 పాయింట్లు.. ఇదీ ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్రస్తుత పరిస్థితి. గెలుపోటముల్లో కూడా ఈ రెండు టీమ్స్ ఒకేలా ఉన్నాయి. ఫస్ట్ రెండు మ్యాచ్ లు గెలిచి, ఆ తర్వాత ఒకటి ఓడి మరొకటి నెగ్గుతూ సాగుతున్నాయి. ఇప్పుడు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా ఈ రెండు టీమ్స్ మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.
శుక్రవారం (ఏప్రిల్ 18) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన పంజాబ్, ఆర్సీబీ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వాన కారణంగా టాస్ ఆలస్యమవుతోంది.
ఈ ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ప్రయాణం ఘనంగానే సాగుతోంది. ఈడెన్ లో కేకేఆర్ ను, చెపాక్ లో సీఎస్కేను, వాంఖడేలో ముంబయి ఇండియన్స్ ను, జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. కానీ హోం గ్రౌండ్ లో మాత్రం ఆ టీమ్ ఈ సీజన్ లో ఇంకా బోణీ కొట్టనేలేదు.
కంచుకోట చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫెయిల్యూర్ ఆశ్చర్యాన్ని కలిగించేదే. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో హోం గ్రౌండ్ లో మ్యాచ్ ల్లో ఆర్సీబీ ఓడింది. మరి పంజాబ్ ను ఓడించి సొంతగడ్డపై బోణీ కొడుతుందేమో చూడాలి.
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ తో ఆ టీమ్ జోష్ మీదుంది. కోహ్లి 6 ఇన్నింగ్స్ ల్లో 248 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు బాదాడు. ఫిల్ సాల్ట్ (208), కెప్టెన్ రజత్ పటీదార్ (186) కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. బౌలింగ్ లో పేసర్ హేజిల్ వుడ్ (9 వికెట్లు), స్పిన్నర్ కృనాల్ పాండ్య (8) బౌలింగ్ లో సత్తాచాటుతున్నారు.
గత మ్యాచ్ లో కేకేఆర్ పై 111 రన్స్ ను కాపాడుకుని పంజాబ్ కింగ్స్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న టీమ్ గా నిలిచింది. ఆ విజయంతో పంజాబ్ ప్లేయర్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు అదే దూకుడుతో ఆర్సీబీని మట్టికరిపించాలని చూస్తున్నారు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (250), ప్రియాన్ష్ ఆర్య (216) బ్యాటింగ్ లో పంజాబ్ కు కీలకంగా మారారు. బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్ వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకుంటున్నాడు.
సంబంధిత కథనం