ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోంది. గ్రూప్ మ్యాచ్లు తుది దశకు చేరుతున్నాయి. ప్లేఆఫ్స్కు వెళ్లేందుకు జట్ల మధ్య తీవ్రమైన పోరు ఉంది. మంగళవారం (మే 6) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠ విజయం సాధించి సత్తాచాటింది. వాంఖెడే వేదికగా వర్షం ఆటంకాల మధ్య జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో చివరి బంతికి గెలిచింది శుభ్మన్ గిల్ టీమ్. దీంతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు దూసుకొచ్చింది. 56 మ్యాచ్ల తర్వాత పాయింట్ల టేబుల్లో ఏ జట్టు.. ఏ స్థానంలో ఉందంటే..
గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 8 గెలిచి 3 ఓడింది. దీంతో 16 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. 0.793 నెట్రన్తో ఉన్న ఆ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ముంబైపై గెలిచి టాప్ ప్లేస్కు ఎగబాకింది. ఇంకా గుజరాత్కు జట్టుకు గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు ఉన్నాయి. ఇక ఒక్క మ్యాచ్ గెలిచినా అధికారికంగా ప్లేఆఫ్స్లోకి శుభమన్ గిల్ సారథ్యంలోని టైటాన్స్ అడుగుపెడుతుంది.
11 మ్యాచ్ల్లో 8 గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లు, 0.482 నెట్ రన్రేట్తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో ఏడు గెలిచి.. మూడు ఓడిన (ఒకటి రద్దు) పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో (0.376) మూడో ప్లేస్లో నిలిచింది.
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. సీజన్ ఆరంభంలో పేవలంగా ఆడిన ముంబై.. వరుసగా ఆరు విజయాలతో సత్తాచాటింది. అయితే, హార్తిక్ పాండ్యా టీమ్కు గుజరాత్ బ్రేకులు వేసింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన ముంబై 7 గెలిచి.. ఐదు ఓడింది ముంబై. 14 పాయింట్లతో (1.156) పట్టికలో నాలుగో స్థానానికి వచ్చింది.
టాప్-4కు వచ్చి ప్లేఆఫ్స్లో అడుగుపెట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ కసిగా ఉన్నాయి. ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 6 గెలిచి.. 4 ఓడింది. ఓ మ్యాచ్ వాన వల్ల రద్దయింది. 13 పాయింట్లు, 0.362 నెట్ రన్రేట్తో ఢిల్లీ ప్రస్తుతం పట్టికలో ఐదో ప్లేస్లో ఉంది.
కోల్కతా నైట్రైడర్స్ 11 మ్యాచ్ల్లో ఐదు గెలువగా.. ఒకటి రద్దయింది. 11 పాయింట్లతో (0.249) ఆరో ప్లేస్లో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో ఐదు గెలిచి (10 పాయింట్లు, -0.469) ప్రస్తుతం ఏడో ప్లేస్లో నిలిచింది
ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఔట్ అయ్యాయి. ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో హైదరాబాద్ 3 గెలువగా.. ఏడు ఓడింది. ఒకటి రద్దయింది. దీంతో 7 పాయింట్లతో (-1.192) ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్ల్లో మూడే గెలిచి ఆరు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ల్లో రెండు మాత్రమే గెలిచి, 9 ఓడి 4 పాయింట్లతో (-1.117) చిట్టచివరిదైన పదో స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ 2025లో నేడు (మే 7) కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా మ్యాచ్ జరగనుంది.
సంబంధిత కథనం