పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో మరోసారి అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ప్రభ్సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తాచాటారు. దీంతో శనివారం (ఏప్రిల్ 26) ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసింది.
కేకేఆర్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోరుతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలన్నది ప్లాన్. ఆ దిశగా పంజాబ్ కింగ్స్ కు అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్లతో చెలరేగారు.
ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే ఫోర్ తో పంజాబ్ బ్యాటింగ్ ను ప్రియాన్ష్ ఆర్య గ్రాండ్ గా మొదలెట్టాడు. అక్కడి నుంచి బౌండరీల మోత మోగుతూనే ఇన్నింగ్స్ సాగింది. ఆరంభంలో ప్రభ్సిమ్రన్ స్లోగా ఆడినా ఆ తర్వాత టాప్ గేరులోకి వెళ్లిపోయాడు.
మరో ఎండ్ లో ప్రియాన్ష్ మాత్రం ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. ఐపీఎల్ 2025లో నిలకడ కొనసాగించాడు. పవర్ ప్లేలో ఆ టీమ్ 56 పరుగులతో నిలిచింది. హర్షిత్ రాణా ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన ఆర్య 27 బాల్స్ లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు.
నరైన్ బౌలింగ్ లోనూ ప్రియాన్ష్, ప్రభ్సిమ్రన్ సిక్సర్ల మోత మోగించారు. అతని ఓవర్లో ప్రియాన్ష్ ఓ సిక్సర్, ప్రభ్సిమ్రన్ రెండు సిక్సర్లు బాదారు. ప్రియాన్ష్ ను రసెల్ ఔట్ చేసి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఆ తర్వాత ప్రభ్సిమ్రన్ మరింతగా రెచ్చిపోయాడు. ఎడాాపెడా బాదేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన అతణ్ని వైభవ్ అరోరా పెవిలియన్ చేర్చాడు.
ఆఖర్లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. మ్యాక్స్ వెల్, యాన్సెన్ పెవిలియన్ చేరిపోయారు. ఆ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) నిలబడి టీమ్ స్కోరును 200 దాటించాడు. చివరి ఓవర్లలో కేకేఆర్ గొప్పగా బౌలింగ్ చేసింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం