వరుణుడే గెలిచాడు. మంచి మ్యాచ్ చూద్దామని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను, టీవీల ముందు కూర్చున్న ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తూ వరుణుడే గెలిచాడు. శనివారం (ఏప్రిల్ 26)లో ఈడెన్ గార్డెన్స్ లో కంప్లీట్ కావాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షంతో రద్దయింది.
ఐపీఎల్ 2025 సీజన్ లో వర్షంతో రద్దయిన తొలి మ్యాచ్ ఇదే. మ్యాచ్ లో ఫలితం తేలకపోవడంతో రెండు జట్లూ చెరో పాయింట్ పంచుకున్నాయి. పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ ల్లో 5 విజయాలు, 3 ఓటములు, ఓ రద్దుతో 11 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ 9 మ్యాచ్ ల్లో 3 విజయాలు, 5 ఓటములు, ఓ రద్దుతో 7 పాయింట్లతో ఉంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో, కేకేఆర్ ఏడో స్థానాల్లో ఉన్నాయి.
కేకేఆర్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫస్ట్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేకేఆర్ ఛేదనలో ఒక ఓవర్ కంప్లీట్ అయింది. కేకేఆర్ 7/0తో ఉన్న టైమ్ లో బలమైన గాలులతో కూడిన వర్షం వచ్చింది. దీంతో ఆటకు బ్రేక్ ఇచ్చారు. పిచ్, గ్రౌండ్ ను కవర్లతో కప్పారు. కానీ బలమైన గాలుల ధాటికి కవర్లు వెళ్లి స్టాండ్స్ లో పడటం గమనార్హం.
వేగంతో వీస్తున్న గాలుల కారణంగా కవర్లను కప్పి ఉంచడం గ్రౌండ్ మెన్ కు కష్టంగా మారింది. ఎట్టకేలకు గ్రౌండ్ ను కవర్ చేయగలిగారు. వర్షంతో పాటు ఆకాశంలో మెరుపులు కూడా వస్తున్నాయి. వర్షంతో ఆట ఆగే సమయానికి క్రీజులో కేకేఆర్ ఓపెనర్లు గుర్బాజ్, సునీల్ నరైన్ ఉన్నారు.
వర్షం ఆగి, తిరిగి ఆట రాత్రి 10.35 లోపు స్టార్ట్ కావాల్సి ఉండేది. ఆ తర్వాత ఎంత ఆలస్యమైతే కేకేఆర్ ఛేజింగ్ లో అన్ని ఓవర్లు లాస్ కావాల్సి ఉంటుంది. అప్పుడు టార్గెట్ ను కుదించే అవకాశం ఉంది. కానీ వర్షం ఎంతకూ ఆగలేదు. 5 ఓవర్ల మ్యాచ్ కు కటాఫ్ టైమ్ రాత్రి 11.44 గంటలు. కానీ ఆ టైమ్ వరకు కూడా వర్షం ఆగేలా కనిపించలేదు. ఒకవేళ వరుణుడు శాంతించినా గ్రౌండ్ ఆటకు సిద్ధం కాదనే ఉద్దేశ్యంతో మ్యాచ్ రద్దు చేశారు.
కేకేఆర్ తో ఐపీఎల్ 2025 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. 200కు పైగా స్కోరు సాధించింది. ఆ టీమ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో ఆ టీమ్ బౌలర్లనే ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆటాడుకున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్), జోష్ ఇంగ్లిస్ (11 నాటౌట్) కలిసి లాస్ట్ లో టీమ్ స్కోరును 200 దాటించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం