ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. టాస్ గెలిచిన శ్రేయస్.. నెగ్గితే ప్లేఆఫ్స్ కు పంజాబ్-ipl 2025 pbks vs dc toss update rain stopped in dharamsala a win will get punjab kings play offs berth ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. టాస్ గెలిచిన శ్రేయస్.. నెగ్గితే ప్లేఆఫ్స్ కు పంజాబ్

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. టాస్ గెలిచిన శ్రేయస్.. నెగ్గితే ప్లేఆఫ్స్ కు పంజాబ్

ఐపీఎల్ 2025: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ధర్మశాలలో వర్షం ఆగింది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ షురూ కానుంది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ధర్మశాల స్టేడియం (Surjeet Yadav)

ఐపీఎల్ 2025లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ధర్మశాలలో వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. ఎట్టకేలకు వరుణుడు వెళ్లిపోవడంతో మ్యాచ్ ఆరంభానికి ఆటంకం తొలిగింది. రాత్రి 7 గంటలకు వేయాల్సిన టాస్ 8.15 గంటలకు పడింది. రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్ సాగుతుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే పంజాబ్ నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. మరోవైపు ఢిల్లీకి కూడా గెలుపు తప్పనిసరి. మరి హోరాహోరీ పోరులో విజయం ఎవరిదో చూడాలి.

డైరెక్ట్ ప్లేఆఫ్స్

ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జోరుమీదుంది. ఆ టీమ్ 11 మ్యాచ్ ల్లో ఏడు గెలిచింది. మూడు ఓడింది. వర్షంతో కేకేఆర్ తో మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఆ టీమ్ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిస్తే పంజాబ్ నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఈ ఐపీఎల్ 18లో ప్లేఆఫ్స్ చేరిన ఫస్ట్ టీమ్ గా నిలుస్తుంది.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య బ్యాటింగ్ లో.. అర్ష్ దీప్ సింగ్, చాహల్ బౌలింగ్ లో అదరగొడుతున్నారు. పంజాబ్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆశలు నిలవాలంటే

ఐపీఎల్ 18 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ కు పంజాబ్ కింగ్స్ పై విజయం అత్యవసరం. ఆ టీమ్ 11 మ్యాచ్ ల్లో ఆరు గెలిచింది. నాలుగు ఓడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఢిల్లీ ఖాతాలో 13 పాయింట్లున్నాయి. ఆ టీమ్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉంది.

ప్లేఆఫ్స్ దిశగా పంజాబ్ పై గెలవాల్సిన అవసరం ఢిల్లీకి ఉంది. ఈ మ్యాచ్ లో ఓడితే ఆ టీమ్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత ప్రమాదంలో ఫడతాయి. కేఎల్ రాహుల్, డుప్లెసిస్, కెప్టెన్ అక్షర్ పటేల్, స్టార్క్ పై ఆ టీమ్ ఆశలు పెట్టుకుంది.

ఫుల్ సెక్యూరిటీ

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ లో భాగంగా దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో పాక్ కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.

అయితే మే 11న ధర్మశాలలో జరగాల్సిన ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను మాత్రం అహ్మదాబాద్ కు తరలించారు. ఇప్పటికే ధర్మశాల విమానాశ్రాయాన్ని మూసేసిన సంగతి తెలిసిందే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం