ఐపీఎల్ 2025లో మరో కీలక పోరు. గురువారం (మే 8) ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ను దక్కించుకుంటుంది పంజాబ్. ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో ప్లేఆఫ్స్ చేరిన ఫస్ట్ టీమ్ గా నిలుస్తుంది. అందుకే హోం గ్రౌండ్ లో ఢిల్లీని చిత్తుచేసి ప్లేఆఫ్స్ చేరాలన్నది పంజాబ్ లక్ష్యం. కానీ వర్షం కారణంగా టాస్ ఆలస్యమవుతోంది.
ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జోరుమీదుంది. ఆ టీమ్ 11 మ్యాచ్ ల్లో ఏడు గెలిచింది. మూడు ఓడింది. వర్షంతో కేకేఆర్ తో మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఆ టీమ్ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిస్తే పంజాబ్ నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య బ్యాటింగ్ లో.. అర్ష్ దీప్ సింగ్, చాహల్ బౌలింగ్ లో అదరగొడుతున్నారు. పంజాబ్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఐపీఎల్ 18 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ కు పంజాబ్ కింగ్స్ పై విజయం అత్యవసరం. ఆ టీమ్ 11 మ్యాచ్ ల్లో ఆరు గెలిచింది. నాలుగు ఓడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఢిల్లీ ఖాతాలో 13 పాయింట్లున్నాయి. ఆ టీమ్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉంది.
ప్లేఆఫ్స్ దిశగా పంజాబ్ పై గెలవాల్సిన అవసరం ఢిల్లీకి ఉంది. ఈ మ్యాచ్ లో ఓడితే ఆ టీమ్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత ప్రమాదంలో ఫడతాయి. కేఎల్ రాహుల్, డుప్లెసిస్, కెప్టెన్ అక్షర్ పటేల్ పై ఆ టీమ్ ఆశలు పెట్టుకుంది.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ లో భాగంగా దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో పాక్ కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
అయితే మే 11న ధర్మశాలలో జరగాల్సిన ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను మాత్రం అహ్మదాబాద్ కు తరలించారు. ఇప్పటికే ధర్మశాల విమానాశ్రాయాన్ని మూసేసిన సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం