భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ ను బీసీసీఐ వారం రోజుల పాటు రద్దు చేసింది. దీంతో ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలను విడిచి ఇళ్లకు వెళ్తున్నారని తెలిసింది. 10 ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కూడా తమ ఆటగాళ్ల భద్రత దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయని సమాచారం. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విదేశీ ఆటగాళ్లలో కాస్త టెన్షన్ నెలకొందని టాక్. వీళ్లు భారత్ ను విడిచి వెళ్తున్నారని క్రిక్ ఇన్ఫో తెలిపింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు, అధికారులు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అఫీషియల్స్ భద్రతకు బీసీసీఐ అధిక ప్రాధాన్యతనిస్తోంది. విదేశీ ఆటగాళ్లు, భారత క్రికెటర్లు ఇప్పటికే సొంత ఇళ్లకు చేరేందుకు పయనమయ్యారు. అందుబాటులో ఉన్న విమానాల్లో స్వదేశాలకు వెళ్లేందుకు విదేశీ క్రికెటర్లు ప్రయత్నిస్తున్నారని క్రిక్ ఇన్ఫో రిపోర్ట్ లో తెలిపింది.
"జట్లు ఇప్పటికే విడిపోవడం ప్రారంభించాయి. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందుబాటులో ఉన్న విమానాల్లో తిరిగి వెళ్తున్నారని తెలిసింది’’ అని క్రిక్ ఇన్ఫో పేర్కొంది.
భారత్, పాక్ మధ్య సైనిక ఘర్షణ కారణంగా ఐపీఎల్ 2025లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో తీవ్ర ఆందోళన నెలకొందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల్లో వాళ్లు స్వదేశాలకు చేరుకుంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది జరిగిన మెగా వేలంలో 10 ఫ్రాంచైజీలు 62 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
"ఆటగాళ్లు బాగానే ఉన్నారు. కానీ జరిగిందంతా చూసిన తర్వాత వాళ్లలో ఆందోళన నెలకొంది’2 అని విదేశీ ఆటగాళ్ల మానసిక స్థితి గురించి అడిగినప్పుడు ఒక ఐపీఎల్ జట్టు అధికారి పీటీఐకి తెలిపారు.
ధర్మశాలలో గురువారం (మే 8) పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. కానీ భద్రతా కారణాలతో మ్యాచ్ ను మధ్యలోనే ఆపేశారు. ఇప్పటికే ధర్మశాల విమానాశ్రయాన్ని మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో రోడ్డు మార్గంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు జాతీయ రాజధాని ఢిల్లీకి బయల్దేరారు.
శుక్రవారం (మే 9) జరగాల్సిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ కోసం ఐపీఎల్ బృందం లక్నోలో ఉంది. ఐపీఎల్ ఇప్పుడు వాయిదా పడటంతో ఈ బృందం తిరిగి ప్రయాణం కానుంది.
మే 9 (శుక్రవారం)న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:40 గంటలకు లీగ్ను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అంతకుముందు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లతో సహా వాటాదారులతో సంప్రదింపులు జరిపారు. ఐపీఎల్ను వాయిదా వేయడానికి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయి.
"టాటా ఐపీఎల్ 2025ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తక్షణమే ఒక వారం పాటు నిలిపివేయాలని నిర్ణయించింది. సంబంధిత అధికారులు, వాటాదారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత టోర్నమెంట్ కొత్త షెడ్యూల్, వేదికల గురించి ప్రకటిస్తాం" అని సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.
సంబంధిత కథనం