టీ20 మజాను మరోసారి అందించేందుకు.. పొట్టి క్రికెట్ మత్తులో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. ఐపీఎల్ 2025 రేపే (మార్చి 22) స్టార్ట్ అవుతుంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించబోతున్నారు.
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. సింగర్స్ శ్రేయా ఘోషాల్, కరణ్ స్పెషల్ పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ‘కల్కి 2898 ఏడీ’, 'యోధ' వంటి చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి దిశా పటాని కూడా ఈ ఓపెనింగ్ సెర్మనీలో అలరించనుంది. శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ కూడా ఈ వేడుకలోపాల్గొనే అవకాశముంది. 'సికందర్' ప్రమోషన్ కోసం సల్మాన్ ఖాన్ కూడా హాజరుకావచ్చు.
ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. ఫైనల్ మే 25న నిర్వహిస్తారు. 13 స్టేడియాలు మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తాయి.
ఐపీఎల్ ప్రారంభోత్సవం మార్చి 22న సాయంత్రం 6 గంటలకు ఆరంభమవుతుంది. ఆ తర్వాత సీజన్ తొలి మ్యాచ్ లో కేకేఆర్, ఆర్సీబీ తలపడతాయి. ఈడెన్ గార్డెన్స్ వేదిక. మ్యాచ్ సాయంత్రం 7.30 కు స్టార్ట్ అవుతుంది. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో మ్యాచ్ లు చూడొచ్చు. జియోహాట్ స్టార్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించొచ్చు.
పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ నెల 20న మొదలైన వర్షాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
శనివారం ఐపీఎల్18 ప్రారంభంకానున్న నేపథ్యంలో పశ్చిమ్ బెంగాల్లో వర్ష సూచన.. క్రికెట్ లవర్స్ని ఆందోళనకు గురిచేస్తోంది.
సంబంధిత కథనం