ఐపీఎల్ 2025 సీజన్ ప్రీ క్లైమాక్స్ కు వచ్చేసింది. 10 జట్ల సమరం కాస్తా 3 టీమ్ ల పోరుగా మారింది. ఇక మిగిలింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్. ఈ సీజన్ లో ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. క్వాలిఫయర్ 2, ఫైనల్ మాత్రమే మిగిలాయి.
ఐపీఎల్ 2025లో ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం (మే 29) క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ ను ఆర్సీబీ చిత్తు చేసింది. ఆ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఫస్ట్ పంజాబ్ ను 101 పరుగులకే ఆలౌట్ చేసింది. ఛేజింగ్ 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది.
ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్ చేరిపోయింది. ఇక మిగిలిన మరో బెర్తు కోసం పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య క్వాలిఫయర్ 2 రేపు (జూన్ 1) జరగబోతోంది. ఇందులో గెలిచిన టీమ్ జూన్ 3న జరిగే టైటిల్ పోరులో ఆర్సీబీని ఢీ కొడుతుంది. ఈ రెండు మ్యాచ్ లకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.
లీగ్ దశలో టాప్-2లో నిలవడంతో క్వాలిఫయర్ 1 ఆడే ఛాన్స్ దక్కించుకుంది పంజాబ్. అందుకే ఆర్సీబీ చేతిలో ఓడినా ఫైనల్ చేరేందుకు ఆ టీమ్ కు మరో అవకాశం దొరికింది. ఇక ఎలిమినేటర్ లో గుజరాత్ ను ఓడించి, ఇంటికి పంపించింది ముంబయి ఇండియన్స్.
ప్రస్తుతం ఐపీఎల్ 2025 టైటిల్ రేసులో ఉన్న మూడు జట్లలో రెండు టీమ్స్ తొలి ట్రోఫీ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకూ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు. మరి ఈ రెండు టీమ్స్ లో ఏదైనా ఈ సారి విన్నర్ గా నిలుస్తుందేమో చూడాలి. ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ వచ్చే అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ హిస్టరీలో ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకూ అయిదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు ఆరో టైటిల్ పై గురి పెట్టింది. అది సాధ్యం కావాలంటే ఆ టీమ్ ఇంకా రెండు మ్యాచ్ లు గెలవాలి. ఈ సీజన్ ఆరంభంలో ఫస్ట్ 5 మ్యాచ్ ల్లో నాలుగు ఓడిన ముంబయి.. ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది.
తర్వాతి 9 మ్యాచ్ ల్లో ఏకంగా ఏడు గెలిచి ప్లేఆఫ్స్ చేరింది. ఇప్పుడు ఎలిమినేటర్ లో గుజరాత్ ను ఓడించింది. ఇక క్వాలిఫయర్ 2లో పంజాబ్ పై గెలిచి, తుదిపోరులో ఆర్సీబీని మట్టికరిపిస్తే ఆ టీమ్ దే టైటిల్.
సంబంధిత కథనం