ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మాజీ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కు షాకింగ్ న్యూస్. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది లీగ్ ఆరంభ దశ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశముంది. ముంబయి ఇండియన్స్ ఆడే మొదటి నాలుగైదు మ్యాచ్ ల్లో బుమ్రా ఆడేలా కనిపించడం లేదని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో తెలిపింది.
వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా.. ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశముంది. ఈ సీజన్ తొలి రెండు వారాల్లో ముంబయి నాలుగు మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 22న ఈ సీజన్ ఆరంభమవుతుంది. మార్చి 23న ముంబయి తన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ తో ఆడుతుంది. వీటితో పాటు మరో రెండు లేదా మూడు మ్యాచ్ ల వరకు బుమ్రా గేమ్ ఫిట్ నెస్ సాధించేలా కనిపించడం లేదు.
వెన్నునొప్పితో ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో టెస్టుతో బుమ్రా మధ్యలోనే తప్పుకొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతను ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడటం లేదు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బుమ్రా కోలుకుంటున్నాడు.
“బుమ్రా వైద్య నివేదికలు బాగానే ఉన్నాయి. ఎన్సీఏ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో బుమ్రా కోలుకుంటున్నాడు. మళ్లీ బౌలింగ్ ప్రారంభించాడు. కానీ మరో 15 రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అతని పరిస్థితి చూస్తుంటే పోటీ క్రికెట్లోకి తిరిగి రావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఏప్రిల్ లో మొదటి వారంలో ఫిట్నెస్ సాధించే ఛాన్స్ ఉంది’’ అని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే ఇంగ్లండ్ సిరీస్ పై బీసీసీఐ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ సిరీస్ నేపథ్యంలో బుమ్రా విషయంలో బీసీసీఐ జాగ్రత్త పడుతోంది. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఆ సిరీస్ లో రోహిత్ నుంచి బుమ్రా టెస్టు పగ్గాలు స్వీకరించే అవకాశమూ ఉంది. దీంతో బుమ్రాతో పాటు షమి విషయంలోనూ బీసీసీఐ జాగ్రత్త వహిస్తోంది. ఐపీఎల్ లో ఈ ఇద్దరి వర్క్ లోడ్ ను మానిటర్ చేయనుంది.
సంబంధిత కథనం