తొలి అయిదు మ్యాచ్ ల్లో ఒక్కటే గెలుపు.. ఐపీఎల్ 2025ను ముంబయి ఇండియన్స్ అత్యంత పేలవంగా మొదలెట్టింది. కానీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఆ టీమ్ వరుసగా అయిదో విక్టరీ ఖాతాలో వేసుకుంది. ఆదివారం (ఏప్రిల్ 27) వాంఖడేలో జరిగిన మ్యాచ్ లో ముంబయి 54 రన్స్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తుచేసింది.
వెన్నెముక గాయం నుంచి కోలుకుని తిరిగి ఐపీఎల్ లో అడుగుపెట్టిన తర్వాత తొలిసారి లక్నోతో మ్యాచ్ లో బుమ్రా తన రేంజ్ బౌలింగ్ తో అదరగొట్టాడు. 4 వికెట్లతో లక్నోను చావుదెబ్బ కొట్టాడు. దీంతో 216 పరుగుల ఛేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 161 పరుగులే చేయగలిగింది. బౌల్ట్ 3, విల్ జాక్స్ 2 వికెట్లు తీశారు.
భారీ ఛేదనలో లక్నో తడబడింది. ముంబయి పేసర్లు, స్పిన్నర్లు ఆ టీమ్ ను దెబ్బకొట్టారు. మార్ క్రమ్ (9) వికెట్ తో బుమ్రా ఖాతా ఓపెన్ చేశాడు. ఆ దశలో మిచెల్ మార్ష్ (34), పూరన్ (27) చెలరేగారు. కానీ పవర్ ప్లే ముగిసిన వెంటనే బౌలింగ్ కు వచ్చిన పార్ట్ టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్.. ఒకే ఓవర్లో పూరన్, పంత్ (4)ను ఔట్ చేశాడు.
మిడిల్ ఓవర్లలో బౌల్ట్, బుమ్రా సత్తాచాటారు. ఆయుష్ బదోని (35), డేవిడ్ మిల్లర్ (24) మెరుపులతో ఓ దశలో 135/4తో మెరుగ్గానే కనిపించిన ఆ టీమ్.. బౌల్ట్, బుమ్రా చెలరేగడంతో ఆలౌటైంది. 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ఓపెనర్ ర్యాన్ రికిల్టన్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అదరగొట్టారు.
రోహిత్ (12) ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయినా.. విల్ జాక్స్ (29)తో కలిసి రికిల్టన్ బాదుడు కొనసాగించాడు. ఇక సూర్య క్రీజులోకి వచ్చాక సిక్సర్ల మోత మోగింది. సూర్య తన స్టైల్లో 360 డిగ్రీల్లో షాట్లు కొట్టాడు. అయితే చివర్లో నమన్ ధీర్ (25 నాటౌట్), కార్బిన్ బాష్ (20) కలిసి టీమ్ స్కోరును 210 దాటించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
సంబంధిత కథనం