ఐపీఎల్ 2025లో వరుసగా ఆరు విజయాలతో జోరుమీదున్న ముంబయి ఇండియన్స్.. హోం గ్రౌండ్ లో మరోపోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు వేయాలనే టార్గెట్ తో మంగళవారం (మే 5) వాంఖడేలో గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది. ఈ రెండు జట్లు చెరో ఏడు విజయాలు సాధించి, 14 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
అయిదు సార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆ టీమ్ వరుసగా ఆరు విక్టరీలు సాధించింది. ఆ జైత్రయాత్రను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది ముంబయి. అంతే కాకుండా ఈ సీజన్ లో జీటీ చేతిలో ఓటమికి ఇప్పుడు రివేంజ్ తీసుకోవాలని చూస్తోంది.
ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 11 ఇన్నింగ్స్ ల్లో 475 పరుగులు చేశాడు. రికల్టన్ (334) కూడా అదరగొడుతున్నాడు. సూర్య మరోసారి చెలరేగితే ముంబయికి తిరుగుండదు. బౌలింగ్ లో బుమ్రా (11 వికెట్లు), బౌల్ట్ (16), హార్దిక్ పాండ్య (13) ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ అంటే ఇప్పుడు ఆ టీమ్ టాప్-3 బ్యాటర్లే గుర్తుకొస్తున్నారు. సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్ మన్ గిల్, జోస్ బట్లర్ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును గెలిపిస్తున్నారు. సుదర్శన్ 10 మ్యాచ్ ల్లో 504 పరుగులు చేశాడు. గిల్ (465), బట్లర్ (470) కూడా సెన్సేషనల్ ఫామ్ కొనసాగిస్తున్నారు. మరోసారి ఈ టాప్ 3 బ్యాటర్లపై గుజరాత్ ఆశలు పెట్టుకుంది.
గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ జోరుమీదున్నాడు. 10 మ్యాచ్ ల్లో 19 వికెట్లు తీసిన అతనే అత్యధిక వికెట్ల వీరుడిగా పర్పుల్ క్యాప్ తో కొనసాగుతున్నాడు. స్పిన్నర్ సాయి కిశోర్ (13) కూడా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్షద్ ను గుజరాత్ ఆడిస్తోంది.
సంబంధిత కథనం