ఇది కదా రివేంజ్ అంటే.. సంజీవ్ గోయెంకాను పట్టించుకోని రాహుల్.. వీడియో వైరల్-ipl 2025 lsg owner sanjiv goenka and his son try to stop kl rahul but he moved video goes viral delhi capitals ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఇది కదా రివేంజ్ అంటే.. సంజీవ్ గోయెంకాను పట్టించుకోని రాహుల్.. వీడియో వైరల్

ఇది కదా రివేంజ్ అంటే.. సంజీవ్ గోయెంకాను పట్టించుకోని రాహుల్.. వీడియో వైరల్

లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించాడు. మ్యాచ్ తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా.. రాహుల్ తో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు కేెఎల్. ఈ వీడియో వైరల్ గా మారింది.

సంజీవ్ గోయెంకాను పట్టించుకోని కేఎల్ రాహుల్

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా, ఆయన కొడుకును కేఎల్ రాహుల్ పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియో వైరల్ గా మారింది. సంజీవ్ గోయెంకా ఆపుతున్నా రాహుల్ మాట్లాడే మూడ్ లో కనిపించలేదు. దీంతో సంజీవ్ కు అలాగే జరగాల్సిందని, ఇది కదా రివేంజ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాడు.

అప్పుడు సీరియస్

2022 నుంచి 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్ తోనే కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఆ టీమ్ కెప్టెన్ గా వరుసగా రెండు సీజన్లలో ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేర్చాడు. కానీ గతేడాది టీమ్ ఫెయిల్ కావడంతో రాహుల్ పై లక్నో ఓనర్ సీరియస్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ లోనే రాహుల్ తో సంజీవ్ గోయెంకా సీరియస్ గా మాట్లాడిన వీడియో కలకలం రేపింది. ఆ తర్వాత రాహుల్ ను టీమ్ వదిలేసుకుంది.

ఇప్పుడు మాట్లాడాలని

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలంలో కేఎల్ రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో వైజాగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ మ్యాచ్ కు కేెఎల్ రాహుల్ దూరమయ్యాడు. కానీ మంగళవారం (ఏప్రిల్ 22) లక్నోలో ఎల్ఎస్జీతో పోరులో అదరగొట్టి టీమ్ ను గెలిపించాడు. రాహుల్ 42 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తన పాత టీమ్ పై రాహుల్ రివేంజ్ తీర్చుకున్నట్లైంది.

మ్యాచ్ అనంతరం సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి రాహుల్‌కు అభినందనలు తెలిపానే. ఇద్దరూ కరచాలనం చేశారు. గోయెంకా అతని ప్రదర్శనను మెచ్చుకున్నాడు. కానీ రాహుల్ అతనితో మాట్లాడకుండా, గోయెంకాను ఓ చూపు చూసి వెళ్లిపోయాడు. గోయెంకా కుమారుడు శశ్వత్‌తో కూడా రాహుల్ అదే విధంగా ప్రవర్తించాడు. లక్నో ఓనర్, అతని కుమారుడు రాహుల్‌ను ఆపడానికి ప్రయత్నించారు. కానీ రాహుల్ మాట్లాడే మూడ్‌లో లేడు.

రాహుల్ పై కౌంటర్

అయితే సంజీవ్ గోయెంకా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వ్యక్తిగత లక్ష్యాల కంటే జట్టు కోసం ఆడే ఆటగాళ్లపై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు పరోక్షంగా రాహుల్‌పై విమర్శలు చేశాడు. ‘‘గెలుపు కోసం ఆడే మనస్తత్వం ఉన్న ఆటగాళ్లను తీసుకోవాలని అనుకున్నాం. వ్యక్తిగత లక్ష్యాల కంటే జట్టును ముందు ఉంచే ఆటగాళ్లను కోరుకున్నాం. మా కోర్ టీమ్‌ను వీలైనంత వరకు కొనసాగించాలని అనుకున్నాం’’ అని గోయెంకా అన్నాడు.

మెగా వేలానికి ముందు తనకు ఫ్రీడమ్, మంచి వాతావరణం ఉండే జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని కేెఎల్ రాహుల్ చెప్పడం గమనార్హం.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం