ఐపీఎల్ 2025లో వరుస విక్టరీలతో పాయింట్ల టేబుల్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ మరో పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ కు చేరువైన ఆ టీమ్ విజయ పరంపర కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. ఆ టీమ్.. సోమవారం (ఏప్రిల్ 21) ఈడెన్ గార్డెన్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతోంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. గుర్బాజ్ ను టీమ్ లోకి తీసుకుంది.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. 7 మ్యాచ్ లాడిన ఆ టీమ్ 5 విజయాలు సాధించింది. వరుసగా హ్యాట్రిక్ విక్టరీలో ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 10 పాయింట్లతో పాటు మెరుగైన రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ టీమ్ మరో రెండు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకునే అవకాశముంది.
గుజరాత్ టైటాన్స్ టీమ్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్, బట్లర్ కీలకంగా మారారు. 7 ఇన్నింగ్స్ ల్లో సుదర్శన్ 365 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల్లో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. గత మ్యాచ్ లో కండరాల నొప్పితో బాధపడుతూనే 97 రన్స్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో టీమ్ ను గెలిపించిన బట్లర్ కూడా జోరుమీదున్నాడు. అతను 315 పరుగులు సాధించాడు.
బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణ పేస్ తో సత్తాచాటుతున్నాడు. 14 వికెట్లు పడగొట్టనే అతని దగ్గరే పర్పుల్ క్యాప్ ఉంది. స్పిన్నర్ సాయి కిశోర్ (11) కూడా రాణిస్తున్నాడు.
ఈ సీజన్ లో ఒక మ్యాచ్ గెలిస్తే.. వెంటనే తర్వాతి మ్యాచ్ ను ఓడే ఆనవాయితీని కేకేఆర్ కొనసాగిస్తోంది. 7 మ్యాచ్ ల్లో 3 గెలిచిన ఆ టీమ్, 4 ఓడింది. 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. గత మ్యాచ్ లో ఓడిన కేకేఆర్.. ఆనవాయితీ ప్రకారం గుజరాత్ ను చిత్తు చేస్తుందేమో చూడాలి.
కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ లో నిలకడ కొనసాగించడం లేదు. పంజాబ్ కింగ్స్ పై 111 టార్గెట్ ను ఛేదించలేక ఆ టీమ్ బొక్కబోర్లా పడింది. బ్యాటింగ్ లో కెప్టెన్ రహానె (221) మాత్రమే ఫర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్ లో హర్షిత్ రాణా (10) రాణిస్తున్నాడు.
సంబంధిత కథనం