ఐపీఎల్ 2025లో ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ టైటాన్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం (మే 22) హోం గ్రౌండ్ అహ్మదాబాద్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో టైటాన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను కాపాడుకునేందుకు ఈ మ్యాచ్ లో టైటాన్స్ కు గెలుపు అవసరం.
గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. 12 మ్యాచ్ లాడిన ఆ టీమ్ 9 మ్యాచ్ లు గెలిచింది. మూడు ఓడింది. 18 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఈ ప్రదర్శనతోనే ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టింది. ఆ టీమ్ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లోనూ గెలిచి టాప్ ప్లేస్ ను కాపాడుకోవాలని టైటాన్స్ చూస్తోంది.
లక్నోతో మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ కొత్త జెర్సీలో ఆడుతోంది. లావెండర్ కలర్ జెర్సీలో బరిలో దిగుతోంది. క్యాన్సర్ పై అవగాహన కోసం ఆ టీమ్ ఇలా చేస్తోంది. ఈ మంచి కార్యక్రమానికి గుజరాత్ శ్రీకారం చుట్టింది.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆ టీమ్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 12 మ్యాచ్ ల్లో 5 గెలిచిన లక్నో.. 7 ఓడింది. 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న లక్నో పరువు కోసమే పోరాడనుంది.
గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరులో కొంతమంది ప్లేయర్స్ చాలా స్పెషల్. ముఖ్యంగా టైటాన్స్ టాప్-3 బ్యాటర్లు సెన్సేషనల్ ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (617), శుభ్ మన్ గిల్ (601) ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టైటాన్స్ మరో డేంజరస్ బ్యాటర్ బట్లర్ (500) కూడా అదరగొడుతున్నాడు.
బౌలింగ్ లో చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ రెచ్చిపోతున్నాడు. ఈ టైటాన్స్ పేసర్ 21 వికెట్లతో టాప్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. స్పిన్నర్ సాయి కిశోర్ (15) కూడా సత్తాచాటుతున్నాడు.
కెప్టెన్ గా, బ్యాటర్ గా ఫెయిల్ అవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ సారథి పంత్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రూ.27 కోట్ల ధరకు న్యాయం చేయలేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ మ్యాచ్ లో అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. మరోవైపు లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రతి ఓ మ్యాచ్ నిషేధం కారణంగా టైటాన్స్ తో పోరుకు దూరమయ్యాడు.
సంబంధిత కథనం