ఐపీఎల్ 2025లో సూపర్ ఫామ్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ మరోసారి చెలరేగాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అదరగొట్టాడు. దీంతో సోమవారం (ఏప్రిల్ 21) కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో గుజరాత్ మంచి స్కోరే సాధించింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది.
ఈడెన్ గార్డెన్స్ లో శుభ్మన్ గిల్ సెంచరీకి 10 పరుగుల దూరంలో ఆగిపోయాడు. 55 బంతుల్లో 90 పరుగులు చేసిన గిల్.. 10 ఫోర్లు, 3 సిక్సర్లు దంచాడు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. 6 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు.
ఐపీఎల్ 2025లో కేకేఆర్ తో మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అదిరే ఆరంభాన్నిచ్చారు. కానీ ఆ టీమ్ ఇన్నింగ్స్ మాత్రం స్లోగా స్టార్ట్ అయింది. అప్పటికీ 11 బంతుల్లో 6 పరుగులే చేసిన గిల్.. హర్షిత్ రాణా బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లతో జోరందుకున్నాడు. పవర్ ప్లేలో ఆ టీమ్ 45/0తో నిలిచింది.
మిడిల్ ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు సత్తాచాటారు. మొయిన్ అలీ ఓవర్లో గిల్ వరుసగా 6, 4, 4 కొట్టాడు. మరోవైపు సెన్సేషనల్ ఫామ్ కొనసాగించిన సుదర్శన్ ఈ ఐపీఎల్ సీజన్ లో మరో హాఫ్ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. 11 ఓవర్లలోనే గుజరాత్ స్కోరు 100 దాటింది.
హాఫ్ సెంచరీ తర్వాత సుదర్శన్ ఔటైనా.. సూపర్ ఫామ్ లో ఉన్న బట్లర్ మరోసారి పరుగుల మోత మోగించాడు. వస్తూనే రసెల్ బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు బట్లర్. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ గేరు మార్చాడు. బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. స్పిన్నర్లు వరుణ్ బౌలింగ్ లో రెండు ఫోర్లు, నరైన ఓవర్లో సిక్సర్ రాబట్టాడు గిల్.
వైభవ్ అరోరా బౌలింగ్ లో వరుసగా 6, 4 కొట్టిన గిల్ ఆ తర్వాతి బంతికే ఔటైపోయాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో ఆగిపోయాడు శుభ్మన్ గిల్. లాస్ట్ ఓవర్లో బట్లర్ (23 బంతుల్లో 41 నాటౌట్; 8 ఫోర్లు) రెండు ఫోర్లు, షారుక్ ఖాన్ ఓ సిక్సర్ కొట్టడంతో గుజరాత్ స్కోరు 200కు చేరువైంది.
సంబంధిత కథనం