ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కథ ముగిసినట్లే. 8 మ్యాచ్ ల్లో అయిదో ఓటమితో ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలకు దాదాపుగా ఎండ్ కార్డు పడింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ టీమ్ ముందంజ వేయలేదు. గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 111 టార్గెట్ ను ఛేదించలేకపోయిన కేకేఆర్.. సోమవారం (ఏప్రిల్ 21) గుజరాత్ టైటాన్స్ పై 199 లక్ష్యానికి ఎంతో దూరంలో ఆగిపోయింది.
ఈడెన్ గార్డెన్స్ లో హోం టీమ్ కేకేఆర్ ను 39 పరుగుల తేడాతో చిత్తుచేసిన గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్ ల్లో ఆరో విజయంతో టాప్ పొజిషన్ ను మరింత బలపర్చుకుంది. ప్లేఆఫ్స్ కు ఆ టీమ్ మరింత దగ్గరైంది. ఛేజింగ్ లో కేకేఆర్ 159/8 స్కోరు చేసింది. రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరూ చెరో నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తో ఛేజింగ్ లో కేకేఆర్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఈ సీజన్ తొలి మ్యాచ్ ఆడిన గుర్బాజ్ ను ఫస్ట్ ఓవర్లోనే సిరాజ్ ఔట్ చేశాడు. నరైన్ (17), రహానె నెమ్మదిగా ఆడటంతో పవర్ ప్లేలో పరుగులు వేగంగా రాలేదు. పైగా నరైన్ ను రషీద్ పెవిలియన్ చేర్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో కెప్టెన్ రహానె (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, ఓ సిక్సర్) పోరాడాడు.
రహానె క్రీజులో నిలబడ్డా గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో బౌండరీలే కరవయ్యాయి. 34 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. దీంతో 10 ఓవర్లకు 68/2తో నిలిచిన కేకేఆర్ ఔటమి ఖాయమైంది. వికెట్లు చేతిలో ఉన్నా ఆ టీమ్ దూకుడగా ఆడుతుందనే ఆశలు కలగలేదు. సెకండాఫ్ లో జోరు పెంచిన రహానె హాఫ్ సెంచరీ కాగానే వెళ్లిపోయాడు. వెంకటేశ్ అయ్యర్ (14) మళ్లీ ఫెయిల్ అయ్యాడు.
ఓ సిక్సర్, మూడు ఫోర్లు బాదిన రసెల్ మెరుపులకు రషీద్ ఖాన్ తెరదించాడు. రమణ్ దీప్, మొయిన్ అలీని ప్రసిద్ధ్ కృష్ణ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. సాధించాల్సిన రన్ రేట్ అమాంతం పెరిగిపోవడంతో కేకేఆర్ ఓటమి పాలైంది. రఘువన్శీ, రింకు సింగ్ మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించగలిగాయి.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఓ సిక్సర్) సంచలన ఫామ్ ను కొనసాగించాడు. బట్లర్ (23 బంతుల్లో 41 నాటౌట్; 8 ఫోర్లు) ఇన్నింగ్స్ కు మెరుపు ముగింపునిచ్చాడు.
సంబంధిత కథనం