రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఢిల్లీ వేదికగా బుధవారం (ఏప్రిల్ 16) జరిగిన ఐపీఎల్ 2025 పోరులో సూపర్ ఓవర్లో గెలిచింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ అదరగొట్టింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కూడా 188 పరుగులే సాధించింది. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు చేరింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11 పరుగులు చేసింది. రెండు రనౌట్లతో 5 బంతులే ఆడింది. 4 బంతుల్లోనే ఢిల్లీ గెలిచేసింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ ఎలా సాగిందంటే..
189 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ దుమ్మురేపారు. జైస్వాల్ 37 బంతుల్లో 51 పరుగులతో అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. 3 ఫోర్లు, 4 సిక్స్లతో మెరిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 19 బంతుల్లోనే 31 పరుగులతో (రిటైర్డ్ హర్ట్) దూకుడుగా ఆడాడు. 2 ఫోర్లు, 3 సిక్స్లతో దుమ్మురేపాడు. వీరిద్దరూ అదరగొట్టడంతో 6 ఓవర్లలో 63 పరుగులు చేసింది రాజస్థాన్. అయితే, ఆ తర్వాత ఇబ్బందిగా అనిపించడంతో రిటైర్డ్ హర్ట్ అయి పెవిలియన్కు చేరాడు శాంసన్.
కాసేపటికే రియాన్ పరాగ్ (8)ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. జైస్వాల్ మాత్రం దూకుడుగా ఆడాడు. 34 బంతుల్లో అర్ధ శతకం చేరాడు. అయితే 14వ ఓవర్లో ఔటయ్యాడు. మరోవైపు నితీశ్ రాణా ధనాధన్ హిట్టింగ్ చేశాడు. బౌండరీలతో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 28 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు నితీశ్. అర్ధ శతకంతో రాణించాడు. రాణా దూకుడుతో రాజస్థాన్ సులువుగా గెలిచేలా కనిపించింది. అయితే 18వ ఓవర్లో రాణాను ఔట్ చేసి మలుపు తిప్పాడు ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్. యార్కర్ సంధించి ఎల్బీడబ్ల్యూ చేశాడు.
చివరి రెండు ఓవర్లలో గెలుపునకు రాజస్థాన్ 23 పరుగులు చేయాల్సి వచ్చింది. ధృవ్ జురెల్ (17 బంతుల్లో 26 పరుగులు; 2 సిక్స్లు) దూకుడుగా ఆడగా.. షిమ్రన్ హిట్మైర్ (9 బంతుల్లో 15 పరుగులు; 1 ఫోర్) తన రేంజ్ హిట్టింగ్ చేయలేకపోయాడు. మోహిత్ శర్మ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 14 పరుగులు వచ్చేశాయి.
దీంతో చివరి ఓవర్లో రాజస్థాన్ 9 పరుగులు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్ చివరి ఓవర్లో వరుసగా యార్కర్లతో అదరగొట్టాడు. జురెల్, హిట్మైర్కు బౌండరీ కొట్టే అవకాశమే ఇవ్వలేదు. తొలి రెండు బంతులకు సింగిల్స్, తర్వాతి రెండు బంతులకు తలా రెండు రన్స్ వచ్చాయి. ఐదో బంతికి రెండో పరుగుకు అవకాశం ఉన్నా.. హిట్మైర్ను వెనక్కి పంపాడు జురెల్. చివరి బంతిని కూడా స్టార్క్ యార్కర్ వేయగా.. జురెల్ భారీ షాట్ కొట్టలేకపోయాడు. సింగిల్ పూర్తి చేసినా.. రెండో పరుగుకు వచ్చి రనౌట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదల్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
సూపర్ ఓవర్లో రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 11 పరుగులే చేసింది. ఢిల్లీ పేసర్ స్టార్క్ బౌలింగ్ చేశాడు. రాజస్థాన్ బ్యాటర్లు హిట్మైర్, రియాన్ పరాగ్ బ్యూటింగ్కు దిగారు. ఫస్ట్ బాల్ డాట్ కాగా.. రెండో బంతికి బౌండరీ కొట్టాడు హిట్మైర్. మూడో బంతికి సింగిల్ వచ్చింది. నాలుగో బంతికి స్టార్క్ నోబాల్ వేయగా.. ఫోర్ కొట్టాడు పరాగ్. ఫ్రీహిట్కు లేని పరుగుకు హిట్మైర్ రాగా.. పరాగ్ రనౌట్ అయ్యాడు. ఐదో బంతికి ఓ రన్ తర్వాత రెండో పరుగుకు వచ్చి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. సూపర్ ఓవర్లో ఉన్న రెండు వికెట్లను రనౌట్ రూపంలో కోల్పోయింది రాజస్థాన్. ఐదు బంతులే ఆడింది. 11 పరుగులు చేసింది.
సూపర్ ఓవర్లో 12 పరుగుల లక్ష్యం ఉండగా.. ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్, స్టబ్స్ బ్యాటింగ్కు దిగారు. రాజస్థాన్ పేసర్ సందీప్ శర్మ బౌలింగ్ చేశాడు. తొలి బంతికి రెండు పరుగులు చేశాడు రాహుల్. రెండో బాల్కు ఫోర్ బాదాడు. మూడో బంతికి సింగిల్ తీశాడు. ఇలా మూడు బంతుల్లో 7 పరుగులతో రాణించాడు రాహుల్. నాలుగో బంతికి స్టబ్స్ సిక్స్ కొట్టడంతో ఢిల్లీ గెలిచేసింది. సూపర్ ఓవర్లో అద్భుత విజయం సాధించింది. కాగా, ఐపీఎల్లో సుమారు ఐదేళ్ల తర్వాత సూపర్ ఓవర్ జరిగింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ అభిషేక్ పోరెల్ 37 బంతుల్లో 49 రన్స్ (5 ఫోర్లు, ఓ సిక్స్) రాణించాడు. జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (9) మరోసారి నిరాశపరచగా.. గత మ్యాచ్లో సత్తాచాటిన కరుణ్ నాయర్ (0) పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 38 పరుగులతో పర్వాలేదనిపించాడు.
ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34 పరుగులు చేశాడు. మెరుపు హిట్టింగ్తో దుమ్మురేపాడు. అతడు ఔటయ్యాక ట్రిస్టన్ స్టబ్స్ దూకుడుగా ఆడాడు. 18 బంతుల్లో 34 పరుగులతో రాణించాడు. దీంతో ఆఖరి 5 ఓవర్లలోనే 77 రన్స్ చేసింది ఢిల్లీ. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు, మహీశ్ తీక్షణ, వణిందు హసరంగ చెరో వికెట్ తీసుకున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్ పాయింట్ల టేబుల్లో మళ్లీ టాప్కు వచ్చింది. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో ఐదు గెలిచి 10 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ వరుసగా మూడో పరాజయం ఎదుర్కొంది. హ్యాట్రిక్ ఓటమికి గురైంది. రాజస్థాన్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో 2 గెలిచి ఐదు ఓడింది. ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది.
సంబంధిత కథనం