ముకేశ్ ముంచేశాడు.. మార్‌క్ర‌మ్‌, మార్ష్ మెరిసినా.. లక్నోకు మోస్తరు స్కోరే-ipl 2025 dc vs lsg mukesh kumar took four wickets lucknow super giants score mitchel marsh markram delhi capitals ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ముకేశ్ ముంచేశాడు.. మార్‌క్ర‌మ్‌, మార్ష్ మెరిసినా.. లక్నోకు మోస్తరు స్కోరే

ముకేశ్ ముంచేశాడు.. మార్‌క్ర‌మ్‌, మార్ష్ మెరిసినా.. లక్నోకు మోస్తరు స్కోరే

డేంజరస్ బ్యాటర్లతో నిండిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లో మరోసారి తడబడింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్ క్రమ్ మెరిసినా.. అద్భుతంగా పుంజుకున్న ఢిల్లీ బౌలర్లు ఆ టీమ్ కు బ్రేక్ వేశారు. ముకేశ్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టాడు.

ముకేశ్ ను అభినందిస్తున్న ఢిల్లీ ఆటగాళ్లు

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ మారడం లేదు. మంగళవారం (ఏప్రిల్ 22) లక్నోలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఎల్ఎస్జీ ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. మార్ క్రమ్ (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 45; 3 ఫోర్లు, ఓ సిక్సర్) ఫామ్ కొనసాగించాడు. ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు.

మార్ష్, మార్ క్రమ్ జోరు

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ పై టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు మంచి ఆరంభం దక్కింది. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న స్లో పిచ్ పై ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్ క్రమ్ పట్టుదలతో నిలబడ్డారు. ముఖ్యంగా మార్ క్రమ్ చూడముచ్చటైన షాట్లతో బౌండరీలు రాబట్టాడు. పవర్ ప్లే ఆ టీమ్ 51తో నిలిచింది.

టైమ్ ఔట్ తో రివర్స్

9 ఓవర్లకు 82/0తో నిలిచిన లక్నో 180కి పైగా రన్స్ చేస్తుందేమో అనిపించింది. కానీ టైమ్ ఔట్ తర్వాత సీన్ రివర్సైంది. ఈ బ్రేక్ తర్వాత ఢిల్లీ అద్భుతంగా పుంజుకుంది. టైమ్ ఔట్ తర్వాతి ఓవర్లోనే మార్ క్రమ్ ను దుష్మంత చమీర ఔట్ చేశాడు.

ముకేశ్ అదుర్స్

ప్రమాదకర బ్యాటర్ పూరన్ (9)ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఇక ముకేశ్ కుమార్ 14వ ఓవర్లో రెండు వికెట్లతో లక్నోను చావుదెబ్బ కొట్టాడు. అబ్దుల్ సమద్ (2)తో పాటు మిచెల్ మార్ష్ ను పెవిలియన్ చేర్చాడు. 10 నుంచి 17 ఓవర్ల మధ్య 4 వికెట్లు కోల్పోయిన లక్నో 48 రన్స్ మాత్రమే చేసింది.

బదోని మెరుపులు

చేతికి గాయంతో కనిపించిన పంత్ బ్యాటింగ్ కు రాకుండా ఇంపాక్ట్ ప్లేయర్ ఆయూష్ బదోనిని పంపించాడు. బదోని మరోసారి చెలరేగాడు. 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. 6 ఫోర్లు కొట్టాడు. లాస్ట్ ఓవరు తొలి మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టాడు. కానీ వెంటనే బౌల్డ్ అయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్ ఒక డాట్ ఆడి, లాస్ట్ బాల్ కు ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం