ఐపీఎల్ 2025లో డూ ఆర్ డై మ్యాచ్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో ఫెయిలైంది. శుక్రవారం (ఏప్రిల్ 25) హోం గ్రౌండ్ చెపాక్ లో దారుణంగా బ్యాటింగ్ చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ హర్షల్ పటేల్ 4 వికెట్లతో అదరగొట్టాడు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది.
డెవాల్డ్ బ్రేవిస్ (25 బంతుల్లో 42; ఓ ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులతో ఓ దశలో 190 స్కోరు చేసేలా కనిపించిన సీఎస్కే తడబడింది. కానీ హర్షల్ పటేల్ ఇన్నింగ్స్ మలుపు తిప్పాడు. కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఫస్ట్ బాల్ కే గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ (0)ను ఔట్ చేశాడు షమి. సామ్ కరన్ (9) కూడా త్వరగానే వెళ్లిపోయాడు. కానీ ఆయూష్ మాత్రె చెలరేగిపోయాడు. ఈ 17 ఏళ్ల కుర్రాడు మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లోనే 6 ఫోర్లతో 30 పరుగులు చేశాడు.
మరో ఎండ్ లో జడేజా (17 బంతుల్లో 21) నిలబడ్డా వేగంగా ఆడలేకపోయాడు. ఆయూష్ మాత్రె ఔటైన తర్వాత డెవాల్డ్ బ్రేవిస్ బాదుడు కొనసాగించాడు. సీఎస్కే తరపున తొలి మ్యాచ్ లో ఈ దక్షిణాఫ్రికా కుర్రాడు సత్తాచాటాడు. బేబీ ఏబీ డివిలియర్స్ గా పేరు తెచ్చుకున్న బ్రేవిస్ మైదానంలో అన్ని వైపులా షాట్లు కొట్టాడు. సిక్సర్లతో చెలరేగాడు. కమిందు ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టాడు.
12 ఓవర్లకు 107/4తో నిలిచిన సీఎస్కే 190కి పైగా స్కోరు చేసేలా కనిపించింది. కానీ హర్షల్ పటేల్ మాయ చేశాడు. తర్వాతి ఓవర్లోనే కమిందు పట్టిన సూపర్ క్యాచ్ తో బ్రేవిస్ ను వెనక్కిపంపాడు హర్షల్. శివమ్ దూబెకూడా పెవిలియన్ చేరిపోయాడు. ఫ్యాన్స్ కేకల మధ్య అడుగుపెట్టిన కెప్టెన్ ధోని (10 బంతుల్లో 6)ని హర్షల్ బోల్తా కొట్టించాడు.
చివరకు దీపక్ హుడా (22) షాట్లతో సీఎస్కే స్కోరు 150 దాటింది. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం