ఐపీఎల్ 2025 సీజన్ అర్ధంతరంగా ఆగిపోయింది. ఈ సీజన్ ను వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం (మే 9) అనౌన్స్ చేసింది. ఈ సీజన్ లో ఇంకా 16 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ యుద్ధం ఉద్రిక్తతల కారణంగా లీగ్ ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అయితే గతంలోనూ ఐపీఎల్ లో ఇలా జరిగింది. ఐపీఎల్ 2021 సీజన్ కూ మధ్యలో బ్రేక్ వచ్చింది.
ఐపీఎల్ 2021 సీజన్ ను కూడా మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు కరోనా మహమ్మారి అందుకు కారణం. ఓ వైపు కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగినప్పటికీ బయో బబుల్ లో ఆ సీజన్ స్టార్ట్ చేశారు. కానీ బయో బబుల్ ఉల్లంఘనలు, ఆటగాళ్లు, సిబ్బందిలో కొవిడ్-19 కేసులు పెరగడంతో మే నెలలో లీగ్ ను అర్ధంతరంగా ఆపేశారు. ఆ తర్వాత తిరిగి 2021 సెప్టెంబర్ లో యూఏఈలో ఆ ఐపీఎల్ సీజన్ ను కొనసాగించారు.
ఐపీఎల్ హిస్టరీలో రెండు సీజన్లు పూర్తిగా విదేశాల్లో జరిగాయి. 2009లో దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా లీగ్ ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2020లో కరోనా కారణంగా సీజన్ ను ఆలస్యంగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో నిర్వహించారు. 2014లోనూ సార్వత్రిక ఎన్నికల కారణంగానే లీగ్ లో ఫస్ట్ 20 మ్యాచ్ లకు యూఏఈ ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్ లను భారత్ లో నిర్వహించారు. 2021లో కరోనా కారణంగా యూఏఈలో చివరి కొన్ని మ్యాచ్ లు జరిగాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ ను అయితే వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ సీజన్ లో ఇంకా 16 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఇందులో ప్లేఆఫ్స్, ఫైనల్ కూడా ఉన్నాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ 18వ సీజన్ వారం తర్వాత తిరిగి ప్రారంభమవుతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.
అప్పటికీ భారత్, పాక్ మధ్య పరిస్థితి సద్దుమణుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఇక ఈ యుద్దం పరిస్థితుల్లో విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటం కోసం మళ్లీ భారత్ కు వచ్చేది అనుమానమే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 18వ సీజన్ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
సంబంధిత కథనం