India vs Pakistan in Asia cup: ఫ్యాన్స్ కు పూనకాలే.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఒకటి కాదు మూడు మ్యాచ్ లు!-india vs pakistan to play three matches in asia cup 2025 schedule report champions trophy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Pakistan In Asia Cup: ఫ్యాన్స్ కు పూనకాలే.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఒకటి కాదు మూడు మ్యాచ్ లు!

India vs Pakistan in Asia cup: ఫ్యాన్స్ కు పూనకాలే.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఒకటి కాదు మూడు మ్యాచ్ లు!

India vs Pakistan in Asia cup: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడించిన భారత్ అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. కానీ మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో అసలైన కిక్ మిస్సయింది. అయితే ఈ మజాను ఈ ఏడాదే మరోసారి ఎంజాయ్ చేయొచ్చు.

ఆసియా కప్ లో తలపడనున్న ఇండియా, పాక్ (AFP)

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురు చూసే క్రికెట్ ఫ్యాన్స్ కు బంపరాఫర్ లాంటి వార్త ఇది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ చిరకాల ప్రత్యర్థులు ఒక్కసారి తలపడితేనే క్రికెట్ ప్రపంచం ఊగిపోయింది. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు ఒకే టోర్నీలో ఈ దాయాది జట్లు తలపడితే మామూలుగా ఉండదు. ఈ ఏడాది ఆసియా కప్ లో అదే జరిగే అవకాశముంది.

ఈ ఏడాది ఆసియా కప్

ఆసియా ఖండంలోని జట్ల మధ్య పోరుకు వేదికగా నిలిచే ఆసియా కప్ ఈ ఏడాది జరగబోతోంది. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు ఆసియా కప్ జరిగే అవకాశం ఉంది. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఆసియాకప్ ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు.

తటస్థ వేదికలో

నిజానికి ఈ ఆసియా కప్ 2025 కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ కు భారత్ వెళ్లలేదు. దీంతో ఆసియా కప్ కోసం భారత్ కు పాక్ వచ్చే అవకాశం లేదు. అందుకే ఆసియా కప్ ను తటస్థ వేదికలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్లాన్ చేస్తోందని క్రిక్ బజ్ తెలిపింది. శ్రీలంక లేదా యూఏఈలో ఈ టోర్నీ జరిగే అవకాశముంది. బీసీసీఐనే హోస్ట్ గా ఉంటుంది.

మెగా పోరుకు సై

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మెగా పోరుపై ఫోకస్ పెట్టిన ఏసీసీ అందుకు తగ్గట్లుగానే షెడ్యూల్ ఖరారు చేయనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ టోర్నీలో ఇండియా, పాక్ గరిష్ఠంగా మూడు సార్లు తలపడే అవకాశముంటుంది. మొదట గ్రూప్ దశలో, ఆ తర్వాత సూపర్-4లో, చివరగా ఫైనల్ చేరితే అక్కడ మరోసారి తలపడే ఛాన్స్ ఉంది.

2023లో ఏం జరిగింది?

చివరగా 2023 ఆసియా కప్ లోనూ భారత్, పాక్ మూడు సార్లు తలపడేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ గ్రూప్ దశలో ఈ దాయాదుల మ్యాచ్ వర్షంతో రద్దయింది. కానీ సూపర్-4లో పాక్ ను భారత్ చిత్తు చేసింది. పాక్ సెమీస్ లో శ్రీలంక చేతిలో ఓడటంతో ఫైనల్ చేరలేకపోయింది. మరోవైపు టైటిల్ పోరు లో శ్రీలంకను ఓడించి భారత్ విజేతగా నిలిచింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం