భారత్, పాక్ వార్.. ఐపీఎల్ రద్దు? లీగ్ ఛైర్మన్ ఏమన్నారంటే? ఈ రోజు మ్యాచ్ జరిగేనా?-india pakistan war situations ipl 2025 may be called off what league chairman arun dhumal said ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  భారత్, పాక్ వార్.. ఐపీఎల్ రద్దు? లీగ్ ఛైర్మన్ ఏమన్నారంటే? ఈ రోజు మ్యాచ్ జరిగేనా?

భారత్, పాక్ వార్.. ఐపీఎల్ రద్దు? లీగ్ ఛైర్మన్ ఏమన్నారంటే? ఈ రోజు మ్యాచ్ జరిగేనా?

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం పరిస్థితుల్లో ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

చీకట్లో ధర్మశాల స్టేడియం (Surjeet Yadav)

ఇండియా, పాకిస్తాన్ మధ్య అనధికార యుద్ధం సాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటున్న భారత్.. దాయాది దేశాన్ని చావుదెబ్బ కొడుతోంది. ఈ పరిస్థితుల్లో బార్డర్ వెంట ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం హై అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్ రద్దవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఛైర్మన్ కామెంట్లు ఇవే

భద్రతా ఆందోళనల కారణంగా ఐపీఎల్ 2025 కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితిని సమీక్షించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. భారత్-పాక్ సైనిక సంఘర్షణ నేపథ్యంలో లీగ్ కొనసాగుతుందా లేదా అని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ పీటీఐతో మాట్లాడుతూ “మేము ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నాం” అని అన్నారు.

“ఈ పరిస్థితి తీవ్రంగా మారుతోంది. మేము ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు అందుకోలేదు. అన్ని వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటాం” అని ధుమాల్ తెలిపారు.

ఈ రోజు మ్యాచ్

ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం (మే 9) లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ రద్దుపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ మ్యాచ్ గురించి అడిగితే.. ‘‘ఇది ప్రస్తుతానికి కొనసాగుతోంది. కానీ పరిస్థితులను బట్టి క్లారిటీ వస్తుంది’’ అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.

మధ్యలోనే రద్దు

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వైమానిక దాడి హెచ్చరికల కారణంగా మధ్యలోనే రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీసీసీఐ వాటాదారులు అత్యవసర సమావేశం నిర్వహించారు.

పొరుగు నగరాలైన జమ్మూ, పఠాన్‌కోట్ లో వైమానిక దాడి హెచ్చరికల నేపథ్యంలో ధర్మశాలలో మ్యాచ్ నిలిపివేశారు. పంజాబ్ జట్టు 10.1 ఓవర్లలో 122 పరుగులకు 1 వికెట్ కోల్పోయినప్పుడు లైట్లు ఆరిపోయాయి. మొదట దీనికి ఫ్లడ్‌లైట్ వైఫల్యం కారణమని భావించారు. కానీ ఆ తర్వాత భద్రత చర్యల్లో భాగంగా ఆటగాళ్లను, ఫ్యాన్స్ ను స్టేడియం నుంచి పంపించేశారు.

భారత్ మాతాకీ జై

"ప్రేక్షకులకు ఎలాంటి భయాందోళనలు లేవు. వాళ్లను (ప్రేక్షకులు మరియు ఆటగాళ్ళు) స్టేడియం నుంచి చాలా జాగ్రత్తగా, సురక్షితంగా తరలించాం" అని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పీటీఐకి తెలిపాయి. స్టేడియం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చాలా మంది ఫ్యాన్స్ భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేశారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేశారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం