IND vs SL 2nd T20: భారత్దే సిరీస్.. రెండో టీ20లో అలవోక గెలుపు.. గంభీర్ హెడ్కోచ్ అయ్యాక తొలి సిరీస్ కైవసం
IND vs SL 2nd T20: శ్రీలంకతో టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. వర్షం ప్రభావంతో టార్గెట్ కుదించిన రెండో టీ20లో టీమిండియా అలవోకగా గెలిచింది. గౌతమ్ గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సిరీస్నే భారత్ దక్కించుకుంది.
శ్రీలంక గడ్డపై టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగించింది. రెండో టీ20లోనూ ఆతిథ్య లంకను భారత్ చిత్తుచేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్ను 2-0తో పక్కా చేసుకుంది. భారత టీ20 రెగ్యులర్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన సిరీస్లో జట్టు అదరగొట్టింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక తొలి సిరీస్నే టీమిండియా కైవసం చేసుకుంది. పల్లెకెలె వేదికగా నేడు (జూలై 28) జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లకు 78 పరుగుల లక్ష్యం రాగా.. 6.3 ఓవర్లలోనే టీమిండియా ఛేదించేసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. అప్పటికే వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా సాగింది. టీమిండియా లక్ష్యఛేదనకు దిగాక మళ్లీ వాన పడింది. దీంతో సమయం వృథా కావడంతో టీమిండియా లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ విధానంలో 8 ఓవర్లకు 78 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. 6.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 81 పరుగులు చేసి గెలిచింది టీమిండియా.
దుమ్మురేపిన యశస్వి, సూర్య, హార్దిక్
లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఊదేసింది భారత్. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30 పరుగులు; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ హిట్టింగ్తో దుమ్మురేపాడు. అయితే, ఈ మ్యాచ్లో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్ (0) తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ఓవర్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే, యశస్వి మాత్రం జోరు కొనసాగించాడు. లంక బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26 పరుగులు) తన మార్క్ విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. 4 ఫోర్లు, ఓ సిక్స్తో దడదడలాడించాడు. జైస్వాల్ కూడా హిట్టింగ్ కొనసాగించాడు. దీంతో 4.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసి.. లక్ష్యానికి భారత్ చేరువైంది. ఆ తర్వాత ఐదో ఓవర్లో సూర్య, ఆ తర్వాతి ఓవర్లో జైస్వాల్ ఔటయ్యారు.
స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 పరుగులు నాటౌట్; 3 ఫోర్లు, ఓ సిక్స్) కూడా హిట్టింగ్తో దుమ్మురేపాడు. చివరి వరకు నిలిచాడు. దీంతో భారత్ అలవోకగా గెలిచేసింది. 9 బంతులను మిగిల్చి మరీ ఆధిపత్య విజయం సాధించింది.
తడబడిన లంక
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభంలో అదరగొట్టినా.. ఆ తర్వాత తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది లంక. కుషాల్ పెరీరా (34 బంతుల్లో 53 పరుగులు) అర్ధ శకతంతో అదరగొట్టాడు. పాతుమ్ నిస్సంక (32) కూడా పర్వాలేదనిపించాడు. అయితే, 3 వికెట్లకు 130 పరుగులతో ఉన్న దశ నుంచి.. చివరి ఐదు ఓవర్లలో కేవలం 31 పరుగులే చేసి 7 వికెట్లు కోల్పోయింది లంక. దీంతో మోస్తరు స్కోరే చేసే చేయగలిగింది.
భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు. లంక బ్యాటర్లను కట్టడి చేశారు.
భారత్, శ్రీలంక మధ్య మూడో టీ20 జూలై 30వ తేదీన పల్లెకెలెలోనే జరగనుంది.