జింబాబ్వే గడ్డపై టీమిండియా పోరు షురూ అయింది. ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ మొదలైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ తొలిసారి సారథ్యం వహిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వగా.. భారత యువ ఆటగాళ్లు ఈ సిరీస్లో ఆడుతున్నారు. భారత్, జింబాబ్వే మధ్య హారారే వేదికగా నేడు (జూలై 6) తొలి టీ20 మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో సికిందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్కు దిగనుంది.
ఈ మ్యాచ్తో భారత జట్టులో అరంగేట్రం చేస్తున్నారు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్. టీమిండియా తరఫున ఇప్పటికే మూడు టెస్టులు ఆడిన ధృవ్ జురెల్ తొలిసారి టీ20 జట్టులో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో దుమ్మురేపిన అభిషేక్, పరాగ్ ఎట్టకేలకు టీమిండియాలో అడుగుపెట్టేశారు.
ఐపీఎల్ 2024 సీజన్లో అభిషేక్ శర్మ భీకర హిట్టింగ్ చేశాడు. ఏకంగా 42 సిక్స్లు బాది.. ఆ లిస్టులో టాప్లో నిలిచాడు. 16 మ్యాచ్ల్లో 484 పరుగులు చేశాడు అభిషేక్. మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. అలవోకగా సిక్స్లు బాది ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్లో దుమ్మురేపడంతో ఇప్పుడు భారత జట్టులోకి వచ్చేశాడు.
రియాన్ పరాగ్ కూడా ఈ ఏడాది ఐపీఎల్లో మెరుపులు మెరిపించాడు. 16 మ్యాచ్ల్లో 573 పరుగులతో రాణించాడు. వరుస మ్యాచ్ల్లో దుమ్మురేపి సత్తాచాటాడు. దీంతో అతడికి జింబాబ్వేతో సిరీస్లో చోటు దక్కింది. తొలి టీ20తోనే భారత జట్టులో అరంగేట్రం చేస్తున్నాడు. టీమిండియా తరఫున టీ20ల్లో ధృవ్ జురెల్ డెబ్యూట్ చేస్తున్నాడు.
ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రానున్నారు. రుతురాజ్ గైక్వాడ్ మూడోస్థానంలో బ్యాటింగ్కు దిగనున్నాడు. పేసర్లుగా అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్కు తుది జట్టులో చోటు దక్కింది.
భారత తుదిజట్టు: శుభమన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్
జింబాబ్వే తుదిజట్టు: తదివానషే మారుమని, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్ ), డియాన్ మేయర్స్, జోనాథన్ క్యాంప్బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెస్లీ మాధెవెరే, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, తెండై చతార
టీ20 ప్రపంచకప్ టీ20 టోర్నీ ఆడిన భారత జట్టులో ఉన్న యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివం దూబేకు కూడా జింబాబ్వే పర్యటనలో చోటు దక్కింది. అయితే, వెస్టిండీస్ నుంచి టీమిండియా ఆలస్యంగా వచ్చింది. దీంతో జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు వారు దూరమయ్యారు. మూడో టీ20 నుంచి భారత జట్టుతో కలుస్తారు. నితీశ్ కుమార్ రెడ్డికి ఈ సిరీస్లో చోటు దక్కినా.. గాయంతో దూరమయ్యాడు. భారత జట్టుకు ఎంపికైన తొలిసారే అతడికి గాయం రూపంలో నిరాశ ఎదురైంది.