Ind vs SL 1st T20: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. భయపెట్టినా చివరికి కుప్పకూలిన లంక బ్యాటర్లు
Ind vs SL 1st T20: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా సులువుగా గెలిచింది. ఆ టీమ్ టాపార్డర్ భయపెట్టినా.. చివరికి కీలకమైన సమయంలో వికెట్లు తీసి ఇండియన్ టీమ్ 43 పరుగులతో విజయం సాధించింది.
Ind vs SL 1st T20: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. శ్రీలంక పర్యటనలోనూ టీమ్ శుభారంభం చేసింది. శనివారం (జులై 27) జరిగిన తొలి టీ20లో శ్రీలంకను 43 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగినా.. లంక టాపార్డర్ భయపెట్టినా.. చివరి ఐదు ఓవర్లలో మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పారు మన బౌలర్లు. 30 బంతుల్లో 29 పరుగులు చేసి ఏకంగా 9 వికెట్లు కోల్పోయింది శ్రీలంక టీమ్.
టీమిండియా శుభారంభం
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో వరల్డ్ ఛాంపియన్స్ విజయం సాధించారు. బ్యాటింగ్ లో సూర్య, పంత్, యశస్వి, గిల్.. బౌలింగ్ లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, సిరాజ్ రాణించడంతో మూడు టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 214 పరుగుల చేజింగ్ లో ఒక దశలో శ్రీలంక.. 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 140 పరుగులతో టార్గెట్ వైపు వెళ్తున్నట్లు కనిపించింది.
అయితే 15వ ఓవర్ తొలి బంతికి టాప్ ఫామ్ లో ఉన్న పథుమ్ నిస్సంకను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో లంక పతనం మొదలైంది. నిస్సంక కేవలం 48 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్ లతో 79 రన్స్ చేశాడు. అతడు ఉన్నంత సేపు లంకను గెలిపించేలానే కనిపించాడు. అతనికితోడు మరో ఓపెనర్ కుశల్ మెండిల్ కూడా 27 బంతుల్లోనే 45 రన్స్ చేశాడు.
అయితే నిస్సంక ఔటవగానే లంక పూర్తిగా గాడి తప్పింది. వాళ్ల ఇన్నింగ్స్ చివరి 30 బంతుల్లో కేవలం 29 పరుగులు చేసి ఏకంగా 9 వికెట్లు కోల్పోవడం గమనార్హం. రియాన్ పరాగ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2, అర్ష్దీప్ 2, బిష్ణోయ్, సిరాజ్ చెరొక వికెట్ తీసుకున్నారు. 170 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. ఆ 170 దగ్గరే ఆ టీమ్ చివరి మూడు వికెట్లు కోల్పోవడం విశేషం.
చెలరేగిన సూర్య, పంత్, యశస్వి
చేపట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఆ కెప్టెన్సీ ప్రభావం తన బ్యాటింగ్ పై ఏమాత్రం ఉండదని ముందే చెప్పాడు. చెప్పినట్లే శ్రీలంకతో జరిగిన తొలి టీ20లోనే చెలరేగాడు. ఆ టీమ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్ లతో 58 రన్స్ చేయడం విశేషం.
74 పరుగుల దగ్గర యశస్వి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అప్పటికే యశస్వి, గిల్ బాదుడుతో ఢీలా పడిన లంక బౌలర్లు.. సూర్య ధాటికి తట్టుకోలేకపోయారు. తనదైన స్టైల్లో గ్రౌండ్ నలుమూలలా ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అందులో 7 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. అంటే కేవలం బౌండరీల రూపంలోనే 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఓ ఫోర్ కొట్టిన సూర్య.. 58 పరుగుల దగ్గర పతిరన బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. డీఆర్ఎస్ తీసుకున్నా.. రీప్లేల్లోనూ అతడు ఔటని తేలింది.
యశస్వి విశ్వరూపం
సూర్య కంటే ముందు యశస్వి.. తర్వాత రిషబ్ పంత్ చెలరేగారు. ముఖ్యంగా యశస్వి తనదైన స్టైల్లో రెచ్చిపోయి ఆడాడు. అతడు కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. అటు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా 16 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. దీంతో ఇద్దరు ఓపెనర్లు పవర్ ప్లే 6 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. పవర్ ప్లే చివరి బంతికి గిల్ ఔటయ్యాడు.
ఆ వెంటనే మరుసటి ఓవర్ తొలి బంతికే యశస్వి కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో సూర్య, పంత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఓవైపు సూర్య చెలరేగితే.. మరోవైపు పంత్ మొదట్లో నెమ్మదిగా ఆడాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 76 పరుగులు జోడించారు. సూర్య ఔటైన తర్వాత పంత్ తన బ్యాట్ కు పని చెప్పాడు. అతడు 33 బంతుల్లోనే 49 పరుగులు చేసి ఔటయ్యాడు.
శ్రీలంక బౌలర్లలో పతిరన 4 వికెట్లు తీసినా.. అతడు 4 ఓవర్లలోనే 40 పరుగులు ఇచ్చాడు. మరో బౌలర్ అసిత ఫెర్నాండో 4 ఓవర్లలోనే 47 పరుగులు, మధుశంక 3 ఓవర్లలోనే 45 పరుగులు ఇవ్వడం విశేషం.