ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. కోట్లాది అభిమానుల హృదయాల్లో సంతోషాన్ని నింపింది. టోర్నీ ఆరంభం నుంచి అదిరే ఆటతో దుమ్మురేపుతున్న టీమిండియా.. న్యూజిలాండ్తో ఫైనల్లోనూ రెచ్చిపోయింది. సుమారు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను భారత్ చేజిక్కించుకుంది. దుబాయ్ వేదికగా నేడు (మార్చి 9) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. బౌలింగ్లో స్పిన్నర్లు రాణించడం సహా లక్ష్యఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో టీమిండియా గెలిచేసింది. మ్యాచ్ ఎలా సాగిందంటే..
ఓ ఓవర్ మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది. లక్ష్యఛేదనలో 49 ఓవర్లలోనే 6 వికెట్లకు 254 రన్స్ చేసి గెలిచింది భారత్. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ఛేజింగ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. టోర్నీలో అంతగా ఫామ్ చూపని హిట్మ్యాన్.. ఫైనల్లో మాత్రం దుమ్మురేపాడు. 83 బంతుల్లో 76 పరుగులతో (7 ఫోర్లు, 3 సిక్స్లు) అదిరే అర్ధ శతకం చేశాడు. ఆరంభం నుంచి రోహిత్ దూకుడుగా ఆడాడు. శుభ్మన్ గిల్ (31 పరుగులు) నిలకడగా ఆడాడు. రోహిత్ క్రమంగా బౌండరీలు బాదాడు. 10 ఓవర్లలోనే 64 రన్స్ రావటంతో ఇక ఛేదన సులభమే అనే పరిస్థితి ఏర్పడింది. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు రోహిత్.
19వ ఓవర్లో కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ ఔటయ్యాడు. దీంతో 105 పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లీ (1)ని బ్రేస్వెల్ ఔట్ చేయటంతో టీమిండియాలో టెన్షన్ పెరిగింది. అయితే రోహిత్ నిలకడగా ఆడాడు. కివీస్ స్పిన్నర్లు కట్టుదిట్టడం బౌలింగ్ చేయటంతో శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 42 పరుగులు) ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. రోహిత్ 27వ ఓవర్లో భారీ షాట్కు యత్నించి స్టంపౌట్ అయ్యాడు.
ఆ తర్వాత శ్రేయస్, అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29 పరుగులు) నిలకడగా ఆడారు. లక్ష్యం వైపు జట్టును నడిపించారు. అయితే 39వ ఓవర్లో శ్రేయస్ ఔట్ కాగా.. ఆ తర్వాత కాసేపటికే అక్షర్ వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ కలిసి కీలకమైన 61 పరుగుల భాగస్వామ్యం జతచేశారు. 40.5 ఓవర్లలో 200 పరుగుల మార్క్ క్రాస్ చేసింది భారత్.
భారత స్టార్లు కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 పరుగులు, నాటౌట్; ఓ ఫోర్, ఓ సిక్స్), హార్దిక్ పాండ్యా (18 పరుగులు, ఓ ఫోర్, ఓ సిక్స్) ఆ తర్వాత నిలకడగా ఆడుతూనే వీలైనప్పుడు బౌండరీలు బాదారు. చేయాల్సిన రన్రేట్ పెరగకుండా జాగ్రత్త పడ్డారు. క్రమంగా పరుగులు రాబట్టారు. హార్దిక్ ఔటైనా రాహుల్ బాగా ఆడాడు. రవీంద్ర జడేజా (6 బంతుల్లో 9 పరుగులు, నాటౌట్) విన్నింగ్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత భారత ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. మైదానంలో వికెట్ స్టంప్లతో కోలాటం ఆడారు రోహిత్, కోహ్లీ.
అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్. 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగుల మోస్తరు స్కోరు చేసింది. డారిల్ మిచెల్ (63 పరుగులు), మైకేల్ బ్రేస్వెల్ (53 పరుగులు నాటౌట్) అర్ధ శతకాలు చేసినా.. మిగిలిన బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు, జడేజా ఓ వికెట్ దక్కించుకోవడం సహా తీయడం సహా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మహమ్మద్ షమీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ వికెట్ తీయకున్నా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించి టైటిల్ దక్కించేసుకుంది.
12 సంవత్సరాల తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను భారత్ దక్కించుకుంది. 2013 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకోవడం టీమిండియాకు ఇది మూడోసారి. 2002, 2013లో టైటిల్ దక్కించుకున్న భారత్.. ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
సంబంధిత కథనం