Ind vs Eng 1st T20 Live: ఇంగ్లండ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూల్చిన టీమిండియా బౌలర్లు.. టార్గెట్ తక్కువే
Ind vs Eng 1st T20 Live: ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించారు. అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రాణించడంతో పటిష్టమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది.
Ind vs Eng 1st T20 Live: ఇంగ్లండ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ టీమిండియా బౌలర్ల ముందు నిలవలేకపోయింది. ఒక్క జోస్ బట్లర్ తప్ప మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అర్ష్దీప్ సింగ్ తొలి ఓవర్లో మొదలుపెట్టిన జోరును ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కొనసాగించడంతో ఇంగ్లండ్ టీమ్ కోలుకోలేకపోయింది. 20 ఓవర్లలో 132 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా ముందు 133 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టీమిండియా బౌలర్ల షో
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావించిన పిచ్ పైనా మన బౌలర్లు సూర్య తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మొదట్లోనే అర్ష్ దీప్ సింగ్ రెండు కీలకమైన వికెట్లతో ఇంగ్లండ్ టాపార్డర్ ను కూల్చగా.. తర్వాత స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మిడిలార్డర్ తో ఆటాడుకున్నారు.
వరుణ్ 3 వికెట్లు తీయగా.. అర్ష్దీప్, అక్షర్ చెరో రెండు వికెట్లతో రాణించారు. అర్ష్దీప్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే ఇవ్వగా.. వరుణ్ 23 పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ కూడా 4 ఓవర్లలో ఓ మెయిడిన్ తోపాటు 22 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ వికెట్ తీయకపోయినా.. 4 ఓవర్లలో 22 పరుగులే ఇవ్వడం విశేషం. హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీసినా.. అతడు 4 ఓవర్లలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు.
బట్లర్ ఒక్కడే
ఇంగ్లండ్ టీమ్ లో కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్ లతో 68 రన్స్ చేశాడు. ప్రతి టీమిండియా బౌలర్ ను సమర్థంగా ఎదుర్కొన్న ఏకైక ఇంగ్లండ్ బ్యాటర్ అతడే. మిగిలిన వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నా.. బట్లర్ క్రీజులో నిలదొక్కుకొని ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైనా సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే 17వ ఓవర్లో స్కోరు వేగం పెంచడానికి ఓ భారీ షాట్ ఆడబోయి నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ తో వెనుదిరిగాడు.