IND vs AUS: ఆసీస్‍తో వన్డే సిరీస్‍కు భారత జట్టు ఇదే.. రెండు మ్యాచ్‍లకు కెప్టెన్‍గా కేఎల్ రాహుల్.. మరిన్ని ప్రయోగాలు-ind vs aus indian squad for australia odi series announced officially ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  Ind Vs Aus Indian Squad For Australia Odi Series Announced Officially

IND vs AUS: ఆసీస్‍తో వన్డే సిరీస్‍కు భారత జట్టు ఇదే.. రెండు మ్యాచ్‍లకు కెప్టెన్‍గా కేఎల్ రాహుల్.. మరిన్ని ప్రయోగాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 18, 2023 09:02 PM IST

IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‍కు భారత జట్టు ఎంపికైంది. ఈ సిరీస్‍కు టీమ్‍ను ప్రకటించారు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. తొలి రెండు వన్డేలకు వేరుగా.. మూడో వన్డేకు వేరుగా టీమ్ ఉంది.

టీమిండియా
టీమిండియా (ANI)

IND vs AUS: ఆసియాకప్‍ 2023 టైటిల్ సాధించిన టీమిండియా తదుపరి స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‍లో తలపడనుంది. వన్డే ప్రపంచకప్‍నకు ముందు ఇండియాలోనే జరగనున్న ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకంగా ఉంది. సెప్టెంబర్ 22వ తేదీన ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఆసీస్‍తో సిరీస్‍కు సెలెక్ట్ చేసిన జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేడు (సెప్టెంబర్ 18) ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నాడు. తొలి రెండు వన్డేలకు, చివరి వన్డేకు టీమ్‍లో చాలా మార్పులు ఉన్నాయి. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ప్రయోగాలు చేశారు సెలెక్టర్లు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చారు. తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనుండగా.. రుతురాజ్ గైక్వాడ్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ కు చోటు దక్కింది. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍కు ఛాన్స్ లభించింది. 21 నెలల తర్వాత టీమిండియా వన్డే జట్టులో అశ్విన్‍కు చోటు దక్కింది. ప్రపంచకప్‍కు ఎంపిక చేసిన ప్రధాన జట్టునే దాదాపు మూడో వన్డేకు ఎంపిక చేశారు సెలెక్టర్లు. కోహ్లీ, రోహిత్, హార్దిక్ ఈ మ్యాచ్ ఆడనున్నారు. అయితే, మూడో వన్డేకు రవిచంద్రన్ అశ్విన్, సుందర్ కూడా జట్టులో ఉన్నారు. అయితే, సంజూ శాంసన్, యజువేంద్ర చాహల్‍కు అసలు అవకాశం దక్కలేదు.

ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‍మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‍దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ

ప్రపంచకప్‍కు ఎంపిక చేసిన జట్టులో ఎవరికైనా గాయమైతే.. వారికి ప్రత్యామ్నాయ ఆప్షన్లను సిద్ధం చేయాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. అందుకే ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు విభిన్నమైన జట్టును ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్‍ను కెప్టెన్ చేసింది. మూడో వన్డేకు మాత్రం ప్రపంచకప్‍ ఆడబోయే ప్రధాన జట్టు ఉంది. అక్షర్ పటేల్ గాయపడటంతో అతడు సిద్ధం కాకపోతే సుందర్, అశ్విన్‍లో ఒకరిని ప్రపంచకప్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

మూడు వన్డేల సిరీస్‍లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ సెప్టెంబర్ 22వ తేదీన మొహాలీలో జరగనుంది. రెండో వన్డే సెప్టెంబర్ 24న (ఇండోర్), మూడో వన్డే సెప్టెంబర్ 27న (రాజ్‍కోట్ ) జరగనున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి ముందు జరగనున్న ఈ సిరీస్ ఇండియా, ఆస్ట్రేలియా రెండు జట్లకు ముఖ్యమైన సన్నాహకంగా ఉండనుంది. జట్ల కాంబినేషన్‍ను సెట్ చేసుకునేందుకు, కొన్ని ప్రయోగాలు చేసేందుకు కూడా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.

వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లేటెస్ట్ అప్‌డేట్స్ చూడండి  Cricket News  అలాగే  Live Score  ఇంకా Telugu News  మరెన్నో క్రికెట్ న్యూస్ హిందుస్తాన్ టైమ్స్ లో చూడండి.