ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ను భారత్ కైవసం చేసుకోవడంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకపాత్ర పోషించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ హీరో అనిపించుకుంటున్నాడు. అయితే, 2021లో మాత్రం వరుణ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 ప్రపంచకప్ ఆడిన వరుణ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఆ టోర్నీలో సూపర్-12 దశలోనే భారత్ నిష్క్రమించింది. పాకిస్థాన్ చేతిలోనూ ఓడింది.
2021 ప్రపంచకప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు వరుణ్. ఆ టోర్నీలో మూడు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవటంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, మూడేళ్ల తర్వాత 2024లో మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి అదరగొడుతున్నాడు. అయితే, 2021 సమయంలో తాను ఎదుర్కొన్న షాకింగ్ విషయాలను వరుణ్ తాజాగా వెల్లడించాడు.
2021 ప్రపంచకప్లో ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోవడం బాధేసిందని వరుణ్ చక్రవర్తి అన్నాడు. గోపీనాథ్కు ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు. “అది నాకు చాలా డార్క్ టైమ్. ప్రపంచకప్కు ఎన్నో అంచనాలతో ఎంపికైనా నేను న్యాయం చేయలేకపోయా. ఒక్క వికెట్ కూడా తీసుకోనందుకు చాలా బాధపడ్డా. మళ్లీ జట్టులోకి తిరిగి రావడం అరంగేట్రం కంటే కష్టమేనని అనుకున్నా” అని వరుణ్ చెప్పాడు.
2021 ప్రపంచకప్ తర్వాత తనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. “2021 ప్రపంచకప్ తర్వాత నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇండియాకు రావొద్దని, రావాలనుకున్నా రాలేవంటూ బెదిరించారు. జనాలు మా ఇంటి దగ్గరికి వచ్చారు. నన్ను కొన్నిసార్లు వెంబడించారు. నేను ఎయిర్పోర్టు నుంచి వస్తుంటే ఇద్దరు నన్ను బైక్పై వెంబడించారు. ఇలాంటివి జరుగుతుంటాయి. నేను అభిమానుల ఎమోషన్స్ అర్థం చేసుకోగలను” అని చక్రవర్తి షాకింగ్ విషయం వెల్లడించాడు.
2021లో శ్రీలంకతో టీ20 సిరీస్తో భారత జట్టులోకి వరుణ్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొట్టి మిస్టరీ స్పిన్నర్గా పేరు తెచ్చుకోవడంతో టీమిండియాలో చోటు దక్కింది. 2021 టీ20 ప్రపంచకప్లోనూ వరుణ్కు అవకాశం వచ్చింది. అయితే ఆ టోర్నీలో ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో సెలెక్టర్లు డ్రాప్ చేసేశారు. గతేడాది ఐపీఎల్లో వరుణ్ దుమ్మురేపడంతో మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు.
భారత జట్టులోకి కమ్బ్యాక్ తర్వాత వరుణ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. టీ20 సిరీస్ల్లో అదరగొట్టాడు. దీంతో వన్డేల్లోనూ అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లతో వరుణ్ మ్యూజిక్ చేసేశాడు. న్యూజిలాండ్తో గ్రూప్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి సత్తాచాటాడు. సెమీస్లోనూ ఎంతో కీలకమైన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ను చక్రవర్తి ఔట్ చేశాడు. న్యూజిలాండ్తో ఫైనల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. గత వారం జరిగిన ఫైనల్లో గెలిచి రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకుంది. 12ఏళ్ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ టోర్నీ చరిత్రలో మూడుసార్లు టైటిల్ దక్కించుకున్న తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.
సంబంధిత కథనం