Hardik Pandya: హార్దిక్ పాండ్యా అటు కెరీర్, ఇటు వ్యక్తిగత జీవితాల్లో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా దారుణమైన ఐపీఎల్ సీజన్ నుంచి కోలుకోక ముందే భార్య నటాషాతో విడాకులు అన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియాతో చేరాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఇప్పటికే చాలా వరకు టీమిండియా సభ్యులు న్యూయార్క్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ తోపాటు పలువురు ఇతర స్టార్ ప్లేయర్స్ వెళ్లిన తొలి బ్యాచ్ తో కలిసి హార్దిక్ పాండ్యా వెళ్లలేదు. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ లీగ్ స్టేజ్ లోనే వైదొలగిన తర్వాత వెకేషన్ కు వెళ్లిన హార్దిక్.. ఇప్పుడు టీమ్ తో చేరాడు.
ఈ విషయాన్ని బుధవారం (మే 29) అతడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. న్యూయార్క్ వెళ్లగానే ట్రైనింగ్ సెషన్ లో బిజీ అయిపోయిన హార్దిక్.. ఆన్ నేషనల్ డ్యూటీ అనే క్యాప్షన్ తో ఆ ఫొటోలను షేర్ చేశాడు. ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి తీవ్ర విమర్శలు, హేళన ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు అదే రోహిత్ కు డిప్యూటీగా వరల్డ్ కప్ లో అడుగుపెడుతున్నాడు.
కెరీర్ పరంగానే కాదు అటు వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. భార్య నటాషాతో విడాకులు తీసుకోబోతున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్ ముగియగానే వెకేషన్ కు వెళ్లాడు. ఇప్పుడు వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ కు ముందు టీమిండియాతో చేరాడు. అయితే ఇన్ని సమస్యల మధ్య అతడు ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
పైగా జట్టులో వైస్ కెప్టెన్ అతడు. ఐపీఎల్ 2024లో కెప్టెన్ గానే కాదు బౌలర్, బ్యాటర్ గానూ అతడు విఫలమయ్యాడు. దీంతో హార్దిక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఐపీఎల్లో 14 మ్యాచ్ లలో కేవలం 216 రన్స్ చేసి, 11 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇలాంటి చెత్త ఫామ్ లో ఉన్న అతడు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఎంత మేర రాణిస్తాడో చెప్పలేం.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా టీమిండియా గ్రూప్ ఎలో ఉంది. ఈ గ్రూపులో ఇండియాతోపాటు పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా టీమ్స్ ఉన్నాయి. ఇండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. తర్వాత జూన్ 9న పాకిస్థాన్ తో, జూన్ 12న యూఎస్ఏతో, జూన్ 15న కెనడాతో తలపడనుంది. ఒక్కో గ్రూపు నుంచి రెండు టీమ్స్ సూపర్ 8 స్టేజ్ కు వెళ్తాయి.
గ్రూపు మ్యాచ్ ల ప్రారంభానికి ముందు టీమిండియా ఓ వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వచ్చే శనివారం (జూన్ 1) బంగ్లాదేశ్ తో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదొక్కటే కాదు ఇండియా ఆడే అన్ని లీగ్ మ్యాచ్ లూ రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి.