టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తాడా అనే నిరీక్షణ కొనసాగుతోంది. గాయం వల్ల గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాతి నుంచి భారత జట్టుకు షమీ దూరమయ్యాడు. అయితే, షమీ మళ్లీ టీమిండియాలోకి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. భారత జట్టు తదుపరి శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. జూలై 27న టీ20 సిరీస్ షురూ కానుంది. ఈ తరుణంలో నేడు (జూలై 23) భారత కొత్త హెడ్కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి మీడియా సమావేశంలో అగార్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ షమీ గురించి అప్డేట్ ఇచ్చారు. లంక పర్యటనకు జడేజాను ఎంపిక చేయకపోవటంపై గురించి కూడా వివరాలు చెప్పారు.
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్టు టెస్టు మ్యాచ్తో భారత జట్టులోకి మహమ్మద్ షమీ మళ్లీ వచ్చే అవకాశం ఉందని అజిత్ అగార్కర్ చెప్పారు. దాన్ని టార్గెట్గా పెట్టుకున్నట్టు చెప్పారు. “షమీ ఇప్పడిప్పుడు మళ్లీ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. అది మంచి సంకేతంగా ఉంది. సెప్టెంబర్ 19 నుంచి జరిగే ఫస్ట్ టెస్టుకు అతడు టీమిండియాలోకి రావాలనే గోల్ పెట్టుకున్నాం. అయితే, కోలుకునేందుకు అదే టైమ్లైన్గా ఉందనేది తెలియదు. ఈ విషయంపై ఎన్సీఏ వారిని అడగాల్సి ఉంది” అని అజిత్ అగార్కర్ చెప్పారు.
గతేడాది వన్డే ప్రపంచకప్ 2023లోనూ గాయంతోనే మహమ్మద్ షమీ ఆడినట్టు తెలిసింది. ఆ టోర్నీలో 24 వికెట్లతో షమీ దుమ్మురేపాడు. గాయం వల్ల సుమారు 8 నెలలుగా భారత జట్టుకు షమీ దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్సీఏలో కోలుకుంటున్నారు. ఇటీవలే మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
గత నెల టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచాక అంతర్జాతీయ టీ20లకు రవీంద్ర జడేజా గుడ్బై చెప్పాడు. అయితే, శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులో జడేజాకు సెలెక్టర్లు ప్లేస్ ఇవ్వలేదు. దీంతో అతడిని తప్పించారా అనే సందేహాలకు అజిత్ అగార్కర్ సమాధానం ఇచ్చారు.
జడేజాను తాము తప్పించలేదని, విశ్రాంతినిచ్చామనేలా అజిత్ అగార్కర్ చెప్పారు. “జట్టును ప్రకటించే సమయంలోనే మేం స్పష్టత ఇచ్చాం. అతడిని తప్పించలేదు. మున్ముందు చాలా టెస్టు సిరీస్లు ఉన్నాయి. వాటిలో అతడు చాలా ఆడతాడు” అని అజిత్ అగార్కర్ చెప్పారు.
అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలను శ్రీలంక పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదో అగార్కర్, గౌతమ్ గంభీర్ చెప్పలేదు.
హార్దిక్ పాండ్యాను కాదని భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్ను చేయడంపై కూడా అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ మాట్లాడారు. హార్దిక్ విషయంలో గాయాల భయం ఉంటుందని, అందుకే సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా చేశామని అగార్కర్ చెప్పారు. కెప్టెన్గా ఉండేవారు ఎక్కువ శాతం అందుబాటులో ఉండాలని అన్నారు.
భారత్, శ్రీలంక మధ్య జూలై 27వ తేదీ నుంచి జూలై 30వ తేదీ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనతోనే టీమిండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నారు.