నీకు సిగ్గుండాలి: పాకిస్థాన్ ప్రధానిపై ఆ దేశ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్.. ఉగ్రదాడి వాళ్ల పనే అని ఆరోపణలు-former pakistan cricketer danish kaneria questions why their prime minister did not condemn the pahalgam terror attack ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  నీకు సిగ్గుండాలి: పాకిస్థాన్ ప్రధానిపై ఆ దేశ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్.. ఉగ్రదాడి వాళ్ల పనే అని ఆరోపణలు

నీకు సిగ్గుండాలి: పాకిస్థాన్ ప్రధానిపై ఆ దేశ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్.. ఉగ్రదాడి వాళ్ల పనే అని ఆరోపణలు

Hari Prasad S HT Telugu

జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నీకు సిగ్గుండాలి అంటూ ఆ దేశ ప్రధానిపైనా కామెంట్స్ చేయడం గమనార్హం. ఇప్పుడతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నీకు సిగ్గుండాలి: పాకిస్థాన్ ప్రధానిపై ఆ దేశ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్.. ఉగ్రదాడి వాళ్ల పనే అని ఆరోపణలు (AFP)

పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన ట్వీట్ ఒకటి సంచలనం రేపుతోంది. ఈ దాడి పాకిస్థాన్ పనే అని, అందుకే తమ ప్రధాని ఇప్పటి వరకూ ఖండించలేదు అన్నట్లుగా అతడు ట్వీట్ చేశాడు. పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఒకప్పుడు పాక్ క్రికెట్ టీమ్ లోని ఏకైక హిందువుగా ఉన్న కనేరియా ఇంకా ఏమన్నాడో చూడండి.

కనేరియా ట్వీట్ వైరల్

పహల్గామ్ దాడి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనే అని ప్రతి ఒక్కరూ బలంగా విశ్వసిస్తున్నారు. పాక్ మాజీ క్రికెటర్ అయిన డానిష్ కనేరియా కూడా ఇప్పుడిదే అంటున్నాడు. ఈ విషయం నీకు సిగ్గుండాలి అంటూ పాక్ ప్రధానినే నిలదీయడం గమనార్హం.

“ఒకవేళ పహల్గామ్ ఉగ్ర దాడిలో పాకిస్థాన్ హస్తం లేకపోతే ప్రధానమంత్రి షెహబాజ్ ఎందుకు ఖండించలేదు? ఎందుకు మీ భద్రతా బలగాలు హైఅలెర్ట్ లో ఉన్నాయి. ఎందుకంటే లోలోపల మీకూ తెలుసు. మీరే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని. సిగ్గుండాలి” అని కనేరియా ట్వీట్ చేశాడు.

పాకిస్థాన్ టీమ్‌లో కనేరియా ఇలా..

పాకిస్థాన్ హిందూ అయిన డానిష్ కనేరియా 2000 నుంచి 2010 వరకు అక్కడి నేషనల్ క్రికెట్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై జీవితకాల నిషేధం విధించారు. 2018లోనూ అతడో మ్యాచ్ ఫిక్సర్ ను కలిశాడన్న ఆరోపణలను ఎదుర్కొన్నాడు.

ఇక గతంలోనూ కనేరియా తన మాజీ టీమ్మేట్స్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తనను మతం మార్చేందుకు మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ప్రయత్నించాడని అతడు ఆరోపించాడు. ఇకప్పుడు పహల్గామ్ ఉగ్రదాడిపై కనేరియా చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.

పహల్గామ్ దాడి ఇలా..

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉగ్రవాదులు స్థానిక పోలీసు దుస్తులు ధరించి, ఫేస్ మాస్క్‌లు ధరించారు. మొదట టూరిస్టుల పేర్లు, ఆ తర్వాత మతం అడిగి, ఆ తర్వాత కల్మా చదవమని బలవంతం చేశారు. కల్మా చదవని వారిని, సంకోచించిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపారు. హిందూ పురుషులనే టార్గెట్ చేశారు.

మహారాష్ట్రలోని పూణే నుండి పహల్గామ్ సందర్శనకు వచ్చిన ఆశావరి మాట్లాడుతూ 'దుండగులు పురుషులను వేరు చేసి కల్మా చదవమని బలవంతం చేశారు. చదవని వారిని అక్కడే కాల్చి చంపారు. పోలీసుల తరహా యూనిఫామ్‌లను చూసి దాడి చేసిన వారు టెర్రరిస్టులని ఎవరూ ఊహించలేరు.' అన్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం