Pat Cummins: ‘మనపై ఆడాలంటే దడ పుడుతోంది.. మైదానంలోకి రాకముందే..’: ప్యాట్ కమిన్స్ అదిరిపోయే స్పీచ్
Pat Cummins Speech - Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. తన టీమ్ ప్లేయర్లలో మరింత కసి పెరిగేలా మాట్లాడాడు. తమ జట్టుపై ఆడాలంటే ఇప్పటికే అందరిలోనూ దడపుడుతోందని చెప్పాడు. దూకుడు కొనసాగించాలని అన్నాడు. ఆ వివరాలివే..
Pat Cummins: ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయి ఆడుతోంది. భీకర దూకుడు ప్రదర్శిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును సృష్టించిన 20 రోజుల్లోనే.. మళ్లీ తానే తిరగరాసేసింది హైదరాబాద్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్లో 287 రన్స్ చేసిన హైదరాబాద్.. ఐపీఎల్లో అత్యధిక పరుగుల రికార్డును మరోసారి సృష్టించింది. ఆ మ్యాచ్లో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత టీమ్ మీటింగ్లో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్ఫూర్తివంతంగా మాట్లాడాడు. ఆ వీడియోను ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ నేడు (ఏప్రిల్ 16) పోస్ట్ చేసింది.
ముంబై ఇండియన్స్తో మార్చి 27న జరిగిన మ్యాచ్లో 277 స్కోరు చేసి.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగుల రికార్డును సన్రైజర్స్ హైదరాబాద్ సృష్టించింది. అయితే, అది జరిగిన 20 రోజుల్లోపే మరోసారి అద్భుతం చేసింది. బెంగళూరుతో సోమవారం మ్యాచ్లో ఏకంగా 287 రన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్రైజర్స్ బ్యాటర్ల దూకుడు.. ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ అదరగొడుతున్నారు హైదరాబాద్ బ్యాటర్లు. అయితే, ఇందుకు కమిన్స్ కెప్టెన్సీ ఓ కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. బెంగళూరుతో మ్యాచ్ తర్వాత కమిన్స్.. జట్టు సమావేశంలో స్ఫూర్తివంతమైన స్పీచ్ ఇచ్చాడు.
మైదానంలోకి రాకముందే వణికించాలి
ఇప్పుడు తమ టీమ్తో ఆడాలంటే జట్లన్నీ భయపడుతున్నాయని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. దూకుడైన తీరును కొనసాగిస్తూ.. మైదానంలోకి రాకముందే కొన్ని జట్లను మానసికంగా ఓడించేయాలని కమిన్స్ చెప్పాడు.
దూకుడు మంత్రం ప్రతీ మ్యాచ్లో పని చేయకపోవచ్చని.. కానీ దాన్నే కొనసాగించాలని హైదరాబాద్ టీమ్కు కమిన్స్ బోధించాడు. “ఇలానే (దూకుడుగా) ఆడాలని అనుకుంటున్నామని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నా, మా నుంచి మీరు వింటూనే ఉన్నారు. అయితే, ఇది ప్రతీ మ్యాచ్లోనూ పని చేయకపోవచ్చు. కానీ నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మనపై ఆడాలంటే అందరూ భయపడుతున్నారు. మైదానంలోకి రాక ముందే మనం కొన్ని జట్లను పూర్తిగా ఓడించేయాలి. మనకు ఇది మరో గొప్ప రోజు. బాగా ఆడారు” అని కమిన్స్ అన్నాడు.
ఇప్పటి వరకు అత్యంత దూకుడుగా ఆడిన తమతో తలపడాలంటే అన్ని జట్లు భయపడుతున్నాయని.. కొన్ని జట్లను మైదానంలోకి రాకముందే సైకలాజికల్గా ఓడించాలనేలా హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. టీమ్ ప్లేయర్లకు బోధించాడు. బెంగళూరుతో మ్యాచ్లో రాణించిన ఆటగాళ్లను అభినందించాడు.
చిన్నస్వామి స్టేడియంలో హోం టీమ్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో గెలిచింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మెరుపు శకతంతో అదరగొడితే.. హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రమ్ అదరగొట్టారు. దీంతో 287 రన్స్ చేసి ఐపీఎల్లో హయ్యెస్ట్ స్కోరు సాధించింది హైదరాబాద్.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం వేలంలో ప్యాట్ కమిన్స్ను రూ.20.50 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఐడెన్ మార్క్రమ్ను తప్పించి కమిన్స్కు కెప్టెన్సీ ఇచ్చింది. ఆస్ట్రేలియన్ మార్క్ అగ్రెసివ్నెస్తో ఈ సీజన్లో హైదరాబాద్కు సారథ్యం వహిస్తున్నాడు కమిన్స్.
ఈ ఐపీఎల్ 2024 సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్ల్లో గెలిచింది. అయితే, భీకరమైన దూకుడుతో అదరగొడుతోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తున్నారు.
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తదుపరి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఏప్రిల్ 20న తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.