ఈ నెల 20న ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్లో భారత్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ కు కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా సీనియర్ల రిటైర్మెంట్ తో అనుభవ లేమితో కనిపిస్తున్నా.. అటు ఇంగ్లండ్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఆ టీమ్.. తొలి టెస్టు కోసం 14 మందితో జట్టును అనౌన్స్ చేసింది.
ఇంగ్లండ్ టీమ్ కు కూడా గాయాల వల్ల కొందరు కీలకమైన ప్లేయర్స్ దూరమయ్యారు. దీంతో బౌలింగ్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ ను తిరిగి తీసుకున్నారు. అతడు జూన్ 2022లో హెడింగ్లీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ తర్వాత తొలిసారిగా మళ్లీ టెస్టు క్రికెట్లోకి వస్తున్నాడు. 31 ఏళ్ల ఓవర్టన్ కు కూడా గత వారం వెస్టిండీస్తో జరిగిన వన్డేలో కుడి చేతి వేలుకు గాయమైంది.
ఇంగ్లండ్కు పేస్ బౌలింగ్లో పెరుగుతున్న గాయాల జాబితా వల్లే ఓవర్టన్కు పిలుపు వచ్చిందని చెప్పవచ్చు. గస్ అట్కిన్సన్ కూడా జట్టులో లేడు. ట్రెంట్ బ్రిడ్జ్లో జింబాబ్వేతో జరిగిన ఇటీవలి టెస్ట్లో కుడి హామ్స్ట్రింగ్ గాయం కారణంగా అతడు సెలెక్షన్కు అందుబాటులో లేడు. అట్కిన్సన్ లేకపోవడం ఇంగ్లండ్ కు దెబ్బే. ఎందుకంటే అతడు మొదటి 12 మ్యాచ్లలో 55 వికెట్లతో రెడ్-బాల్ క్రికెట్లో ప్రమాదకరంగా మారుతున్నాడు.
వీళ్లే కాకుండా మార్క్ వుడ్, ఓల్లీ స్టోన్లు మోకాలి గాయాలతో సిరీస్కు దూరమయ్యారు. జోఫ్రా ఆర్చర్ బొటనవేలి సమస్య కారణంగా కనీసం రెండో టెస్ట్ వరకు మ్యాచ్ ఫిట్నెస్ సాధించే అవకాశం లేదు. ఐదు టెస్టులు ఆడి 27 వికెట్లు పడగొట్టిన సీమర్ బ్రైడన్ కార్స్ను జట్టులోకి తీసుకున్నారు. క్రిస్ వోక్స్ వారి జట్టులో అత్యధిక టెస్టులు ఆడిన సీమర్. అతడు 57 టెస్టుల్లో 181 వికెట్లు పడగొట్టాడు.
బ్యాటింగ్ పరంగా జాకబ్ బెతెల్ జట్టులోకి రావడం ఇంగ్లండ్ కు ఊరట కలిగించేదే. అతడు ఐపీఎల్ మ్యాచ్ల కారణంగా జింబాబ్వే టెస్ట్కు దూరమయ్యాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ సపోర్ట్ ఉన్న బెతెల్, న్యూజిలాండ్లో తన అరంగేట్ర సిరీస్లో 3వ స్థానంలో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు.
అయితే అతనికి పోటీగా ఉన్న జాక్ క్రాలీ, ఓలీ పోప్ ఇద్దరూ జింబాబ్వేపై సెంచరీలు సాధించారు. ఇక ఫిల్ సాల్ట్ స్థానంలో జేమీ స్మిత్ ఇప్పుడు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. వారి బ్యాటింగ్ లైనప్ ఎక్కువగా ఫామ్లో ఉన్న జో రూట్, బెన్ డకెట్ అనుభవంపై ఆధారపడి ఉంటుంది. జింబాబ్వేపై 58 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ భారత్పై మరింత రాణించాలని ఆశిస్తున్నాడు.
18 నెలల కిందట భారత్లో ఇంగ్లండ్ 1-4 తేడాతో సిరీస్ ఓడిపోయినప్పటి నుండి ఇరు జట్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండా శుభ్మన్ గిల్ తొలిసారిగా భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
మరోవైపు, ఇంగ్లండ్ ఆ పర్యటన తర్వాత రిటైర్ అయిన జేమ్స్ అండర్సన్ లేకుండా బరిలోకి దిగనుంది. అలాగే జానీ బెయిర్స్టో, బెన్ ఫోక్స్, ఓలీ రాబిన్సన్ వంటి ఆటగాళ్లను కూడా పక్కన పెట్టారు.
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టోంగ్, క్రిస్ వోక్స్
సంబంధిత కథనం