ఐపీఎల్ 2025లో కీలక పోరు. ఆడిన 9 మ్యాచ్ ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచిన రాజస్థాన్ రాయల్స్ డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. సోమవారం (ఏప్రిల్ 28) హోం గ్రౌండ్ లో ఆ టీమ్ గుజరాత్ టైటాన్స్ ను ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఏ టీమ్ అయినా కనీసం 14 పాయింట్లు సాధించాలి. ఇప్పుడు 9 మ్యాచ్ ల్లో రెండు విజయాలు, 4 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ 9వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఓడితే రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆ టీమ్ కు ఇది కాకుండా ఇంకా 4 మ్యాచ్ లే ఉంటాయి.
గుజరాత్ తో ఓడి, ఆ నాలుగు మ్యాచ్ ల్లో గెలిచినా ఆ టీమ్ పాయింట్స్ 12 మాత్రమే అవుతాయి. అందుకే ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలనే టార్గెట్ తో హోం గ్రౌండ్ లో రాజస్థాన్ అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ శాంసన్ గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. రియాన్ పరాగ్ తాత్కాలిక సారథి. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. తీక్షణ, యుధ్ వీర్ ను ఆడిస్తోంది.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జోరుమీదుంది. ఆ టీమ్ 8 మ్యాచ్ ల్లో 6 గెలిచింది. కానీ రెండు మాత్రమే ఓడింది. 12 పాయింట్లతో టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆ టీమ్.. రాజస్థాన్ పై గెలిస్తే ప్లేఆఫ్స్ కు మరింత చేరువవుతుంది. అందుకే రాజస్థాన్ ను చిత్తుచేసి ఆధిపత్యం కొనసాగించాలని ఆ టీమ్ చూస్తోంది.
గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్, బట్లర్ నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్ లో పేసర్ ప్రసిద్ధ్, స్పిన్నర్ సాయి కిశోర్ అదరగొడుతున్నారు. ఈ మ్యాచ్ తో అఫ్గాన్ ప్లేయర్ కరీమ్ జనత్ ఐపీఎల్ డెబ్యూ చేస్తున్నాడు.
సంబంధిత కథనం